దీదీ మరో సంచలనం.. వర్సిటీలకే సీఎం ఛాన్స్లర్.. కొత్త చట్టం
దీదీ..మమతా బెనర్జీ అంటేనే హడల్.. కేంద్రంపై పోరాడుతూనే ఉంటారు. గవర్నర్తో కిరి కిరీ ఉంటుంది. అయితే బెంగాల్ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గల వర్సిటీలకు ఛాన్స్లర్గా ఇకపై సీఎం వ్యవహరించేలా కొత్త చట్టం రూపొందించింది. సీఎం మమతా బెనర్జీ అధ్యక్షతన గురువారం సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కొత్త చట్టాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు రాష్ట్రంలోని యూనివర్సిటీలకు గవర్నర్ ఛాన్స్లర్గా ఉండేవారు. కొత్త చట్టం ఆమోదం పొందితే, సీఎం ఛాన్స్లర్ అవుతారు. కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అక్కడ ఆమోదించిన తర్వాత, గవర్నర్ కూడా అంగీకారం తెలపాల్సి ఉంటుంది. గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. పశ్చిమ బెంగాల్లోని యూనివర్సిటీల విషయంలో కొంతకాలంగా సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ జగ్దీప్ ధన్కార్ మధ్య వివాదం నడుస్తోంది.
గవర్నర్ నుంచి ఛాన్స్లర్ పదవీని తీసుకోవాలని మమత భావిస్తోంది. కొత్త చట్టాన్ని క్యాబినెట్ ఆమోదించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును సభలో ప్రవేశపెడతామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బ్రత్యా బసు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 17 యూనివర్సిటీలకు గవర్నర్ ఎక్స్-అఫీషియో ఛాన్స్లర్గా కొనసాగుతున్నారు.
మమతా బెనర్జీ అధికారం అంతా తన చేతుల్లోనే ఉండాలని అనుకుంటుందని బీజేపీ మండిపడింది. తనను ఎవరూ ప్రశ్నించకూదనేది ఆమె ఉద్దేశం కావొచ్చు అని కామెంట్ చేసింది. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుందని బీజేపీ విమర్శించింది.