టైమ్ చూసి బాణమేసిన మమత -బెంగాల్లో కూలీల కనీస వేతనం పెంపు -ఈసీ షెడ్యూల్కు నిమిషాల ముందు
అదను చూసి అస్త్రాలు విసరడంలో ప్రధాని మోదీ కంటే తానేమీ తక్కువ తినలేదని మరోసారి నిరూపించుకున్నారు వెస్ట్ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. ఈసారి వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పని పరిస్థితుల్లో జనాన్ని ఆకట్టుకునేందుకు బీజేపీ, టీఎంసీలు పోటాపోటీగా వ్యవహరిస్తుండటం, మోదీ, అమిత్ షా ప్యటనల్లో కేంద్రం తరఫున బెంగాల్ కు భారీ ప్రాజెక్టులెన్నో ప్రకటిస్తుండగా, ఇప్పుడు మమత రోజు కూలీలపై కరుణ కురిపించారు.
ఇంకాసేపట్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందనగా.. పశ్చిమ బెంగాల్ లో కూలీల కనీస వేతనాలను పెంచుతున్నట్లు సీఎం మమత సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం సాయంత్రం భారత ఎన్నికల సంఘం.. బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లయింది. దీనికి కొద్ది నిమిషాల ముందే.. దీదీ వ్యూహాత్మకంగా కూలీ రేట్ల పుంపు నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.
పశ్చిమ బెంగాల్ పట్టణ ఉపాధి పథకం ప్రకారం.. సాధారణ (అన్ స్కిల్డ్) కూలీకి రోజువారీ కనీస వేతనం రూ.144 రూపాలు ఉండగా దాన్నిప్పుడు రూ.202కు పెంచారు. సెమీ స్కిల్డ్ కూలీలకు రూ.172గా ఉన్న వేతనాన్ని రూ .303కు పెంచారు. ఇక కొత్త పాలసీ ప్రకారం స్కిల్డ్ లేబర్ (నైపుణ్యం కలిగిన కార్మికులకు)కు రోజుకు రూ .404 కనీస వేతంగా అందించాల్సి ఉంటుంది. దీనిపై..
''కూలీల వేతనం పెంపు నిర్ణయం వల్ల మొత్తం 56,500 మంది కార్మికులు (40,500 నైపుణ్యం లేనివారు, 8000 మంది సెమీ స్కిల్డ్, 8000 మంది నైపుణ్యం కలిగినవారు) ప్రయోజనం పొందుతారు. ఈ వేతనాలు గ్రామీణ కార్మికుల మెరుగైన వేతనంతో సమానంగా ఉంటాయి. దీనికి సంబంధించి ఇప్పటికే బడ్జెట్ కేటాయింపు జరిగాయి'' అని సీఎం మమత తన ట్వీట్ లో పేర్కొన్నారు. 294 స్థానాలున్న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరుగనున్నాయి.