బెంగాల్లో ఆగని హింస.. చివరి దశలోనూ మారని సీన్..
కోల్కతా : సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్లోనూ బెంగాల్లో పరిస్థితి మారలేదు. గత ఆరు దశల మాదిరిగానే ఈసారి కూడా హింస కొనసాగుతోంది. బెంగాల్లోని 9 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగుతుండగా... కొన్ని చోట్ల ఈవీఎంలు, వీవీ ప్యాట్ మెషీన్లు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యమైంది. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినా పరిస్థితి అదుపుతప్పింది. ఉప ఎన్నిక జరుగుతున్న ఇస్లాంపూర్ పోలింగ్ కేంద్రంలో పేలుడు జరిగినట్లు తెలుస్తోంది.
స్కార్ఫ్లు ధరించి దొంగ ఓట్లుc
బీజేపీ, తృణమూల్ కార్యకర్తల దాడులు, ప్రతిదాడులతో బెంగాల్లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నార్త్, సౌత్ కోల్కతా నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన మహిళా కార్యకర్తలు అక్రమాలకు పాల్పడుతున్నారని జాదవ్పూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అనుపమ్ హజ్రా ఆరోపించారు. స్కార్ఫ్లు ధరించి దొంగ ఓట్లు వేస్తున్న వారిని అడ్డుకోగా పోలింగ్ బూత్లలో అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
పోలింగ్ కేంద్రం వద్ద ధర్నా
బసిర్హాత్ నియోజకవర్గంలో తృణమూల్ నేతలు ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారంటూ బీజేపీ ధర్నా చేపట్టింది. తమ పార్టీకి చెందిన వంద మందిని ఓటేయకుండా నిలువరించారని బసిర్హాత్ బీజేపీ అభ్యర్థి సయంతన్ బసు ఆరోపించారు. టీఎంసీ నేతల గూండాయిజంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పోలింగ్ ఏజెంట్లపై దాడి చేశారంటూ సీపీఎం అభ్యర్థి కొనినికా ఘోష్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తృణమూల్ నేతలు తమ పోలింగ్ ఏజెంట్లను బెదిరించడంతో పాటు దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ అభ్యర్థి రాహుల్ సిన్హా ఆరోపించారు. టీఎంసీ కార్యకర్తల దాడిలో తమ కార్యకర్తతో పాటు ఓ కెమెరామెన్కు గాయాలయ్యాయని చెప్పారు.
బీజేపీ ఆఫీసుకు నిప్పు
ఇదిలా ఉంటే పోలింగ్కు ముందురోజు సైతం బెంగాల్లో ఘర్షణలు జరిగాయి. శనివారం రాత్రి రాజర్హట్ ప్రాంతంలోని బీజేపీ ఆఫీసుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మథురాపూర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో నాటు బాంబు దాడులు జరిగాయి. గత ఆరు విడతల్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసీ పోలింగ్ జరుగుతున్న 9 నియోజకవర్గాల్లో 710 కంపెనీల కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేసినా పరిస్థితిలో మార్పు రాకపోవడం గమనార్హం.