బెంగాల్ విద్యార్ధికి గూగుల్ 1.10 కోట్ల ఆఫర్: టెక్కీలకు మూడు రెట్లు పెరిగిన సరాసరి వేతనం
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లోని చిన్న పట్టణానికి చెందిన ఆసిప్ అహ్మద్ అనే యువకుడికి జాదవ్ పూర్ యూనివర్సిటీలో జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో గూగుల సంస్ధ రూ. 1.10 కోట్ల వేతనాన్ని ఆఫర్ చేసింది. 23 ఏళ్ల అహ్మద్ జాదవ్ పూర్ యూనివర్సిటీలో కంపూటర్ సైన్సు ఇంజనీరింగ్ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు.
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలలో గూగుల్ కంపెనీ నిర్వహించిన గూగుల్ ఏపీఏసీ రౌండ్ బీ ఆన్లైన్ టెస్టు ఎగ్జామ్కు హాజరయ్యాడు. ఆ తర్వాత గూగుల్ బెంగుళూరు ఆఫీసులో ఇంటర్యూకి హాజరయ్యాడు. ఆనంతరం గూగుల్ కంపెనీ ఈ ఏడాది మార్చిలో ఉద్యోగానికి ఎంపికైనట్లు తెలియజేస్తూ ఈమెయిల్ను పంపింది.
ఈ-మెయిల్లో అహ్మద్కు సింగపూర్లోని గూగుల్ క్యాంపస్లో పనిచేసేందుకు అవకాశం ఇవ్వడంతో పాటు రూ. 1.10 కోట్ల వేతనాన్ని ఆఫర్ చేసింది. అయితే గూగుల్ కంపెనీ తమ వర్సిటీ విద్యార్ధికి ఇంత పెద్ద మొత్తంలో ఆఫర్ ఇస్తుందని తాము ఊహించలేదని వర్శిటీ ప్లేస్ మెంట్ ఆఫీసర్ సమితా భట్టాచార్య వ్యాఖ్యానించారు.
జాదవ్ పూర్ యూనివర్సిటీ చరిత్రలోనే ఇది ఒక గొప్ప సందర్భమని వర్సటీ ఉపకులపతి సురంజన్ దాస్ తెలిపారు. ఇదిలా ఉంటే మిగతా విభాగాలైన మెకానికల్, కెమికల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాల విద్యార్థులకు దేశంలో పనిచేసేందుకు రూ. 30 లక్షల వరకూ ఆఫర్లు వచ్చాయని ఆయన తెలిపారు.
గతేడాది సరాసరి వేతనం రూ. 3 లక్షలు కాగా, ఈ ఏడాది అది మూడు రెట్లు పెరిగి రూ. 10 లక్షలకు చేరిందని వివరించారు. తమ వర్శిటీ బ్రిక్స్ దేశాల్లోని టాప్ 100 వర్శిటీల్లో స్థానం సంపాదించుకుందని ఆయన తెలిపారు. గూగుల్ ఇంటర్యూ గురించి ఆసిఫ్ ఈ విధంగా స్పందించారు.
"వారు నన్ను చాలా ప్రశ్నలు అడిగారు. వాటిల్లో అత్యధికం నేను చదివిన సబ్జెక్ట్ గురించే ఉన్నాయి. ముందుగానే ప్రిపేర్ కావడంతో ఇంటర్వ్యూ బాగా సాగింది. అయితే, వేతనం గురించి వారు చెప్పగానే నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాను" అన్నాడు.
ఉద్యోగానికి సంబంధించి గూగుల్ యాజమాన్యం పంపిన లెటర్ అందిందని, సెప్టెంబర్ నెలలో ఉద్యోగంలో చేరాలని వారు ఆదేశించారని ఆసిఫ్ తెలిపారు. ఇదే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అమెజాన్ ఆసిఫ్కు రూ. 27 లక్షల ఆఫర్ ఇచ్చిందని వివరించాడు. ఇక ఆసిఫ్ విషయానికి వస్తే కృష్ణగిరినగర్ జిల్లాలోని నాదియా అనే గ్రామానికి చెందిన వాడు.
తండ్రి ఆర్సఫ్ ఉద్దీన్ అహ్మద్ స్థానిక కోర్టులో లాయర్గా ఉన్నారు. తల్లి అంబరీన్ అహ్మద్ గృహిణి. జాదవ్ పూర్ వర్సిటీకి చెందిన మరో విద్యార్ధి విఖాయత్ ఖోస్లాకు మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్ క్యాంపస్లో పనిచేసేందుకు రూ. 30 లక్షల వేతన ప్యాకేజీని ఆఫర్ చేసింది.