షాకింగ్: నగ్నఫొటోలతో విద్యార్థుల బ్లాక్ మెయిల్... గృహిణి ఆత్మహత్య
కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ గృహిణి మొబైల్ నుంచి ఆమె వ్యక్తిగత ఫోటోలను స్వాధీనం చేసుకున్న కొందరు విద్యార్థులు.. వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బ్లాక్ మెయిల్కు దిగారు. ఆ వేధింపులను తట్టుకోలేక చివరకు గృహిణి ఆత్మహత్య చేసుకుంది.
పోలీసులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. సదరు మహిళ(35) భర్త ఉద్యోగరీత్యా ఒడిశాలో పని చేస్తుండగా.. తన కూతుళ్లు, అత్తమామలతో కలిసి ఆమె చాందీపూర్లో నివసిస్తోంది. కొద్దిరోజుల క్రితం తన కూతుర్ని డాన్స్ స్కూల్కు తీసుకెళ్తున్న క్రమంలో ఆమె తన మొబైల్ ఫోన్ను పోగొట్టుకుంది.
విద్యార్థి చేతిలో పడిన మొబైల్ ఫోన్...
అనుకోకుండా ఆ మహిళ మొబైల్ ఫోన్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివే ఓ విద్యార్థి(17)కి దొరికింది. అదే ఆమె పాలిట శాపమైంది. ఆ విద్యార్థి అందులో ఉన్న ఆమె ఫోటోలన్నీ చూశాడు. వాటిలో కొన్ని అభ్యంతరకరమైన ఫొటోలు కూడా ఉన్నాయి. వాటిని చూడగానే ఆ విద్యార్థి మెదడులో మరో ఆలోచన మొదలైంది. తెలివిగా ఆ ఫొటోలన్నీ తన మొబైల్కు పంపించుకుని, ఏమీ ఎరుగనివాడిలా ఆ మహిళ మొబైల్ ఫోన్ను ఆమెకు ఇచ్చేశాడు.
ఆ ఫొటోలే ఆధారంగా... బ్లాక్ మెయిల్కు దిగిన విద్యార్థి...
ఆ తరువాత ఆమె ఫొటోలను ఆధారంగా చేసుకుని ఆ మహిళను బ్లాక్ మెయిల్ చేయసాగాడు. తాను చెప్పినట్లు వినకపోతే ఆ అభ్యంతరకరమైన ఫొటోలను సోషల్ మీడియాలోకి అప్లోడ్ చేస్తానంటూ బెదిరించసాగాడు. ఈ వ్యవహారంలో ఆ విద్యార్థికి చందన్(21) అనే మరో యువకుడితోపాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా సహకరించారు.
చివరికి ఆత్మహత్య చేసుకున్న గృహిణి...
రోజూ ఈ విద్యార్థులు వేధిస్తుండడంతో ఆ మహిళకు ఏం చేయాలో అర్థం కాలేదు. తన ఫొటోలు వారి చేతుల్లోకి ఎలా వెళ్లాయో కూడా అర్థం కాలేదు. ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయేది. వారికి ఆమె లొంగకపోవడంతో చెప్పినట్లుగానే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ అవమానం భరించలేక శనివారం రాత్రి తన ఇంట్లోనే ఉరేసుకుని ఆ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు.. జరిగిన కథంతా ఆమె తన సూసైడ్ నోట్లో పేర్కొంది.
లైంగికంగానూ వేధించారా?
ఆ విద్యార్థులు తన సోదరిని లైంగికంగానూ వేధించారని మృతురాలి సోదరుడు చెబుతున్నాడు. చనిపోయే ముందు ఆమె విషయాన్ని తనకు చెప్పుకుని రోదించిందని.. తాను తన సోదరిని ఓదార్చానని, కానీ తిరిగి తాను ఇంటికెళ్లే సరికి తన సోదరి ఈ అఘాయిత్యానికి పాల్పడిందని అతడు కన్నీటిపర్యంతమయ్యాడు.
కఠినంగా శిక్షించాలని డిమాండ్....
మరోవైపు వేధింపులకు పాల్పడి చివరికి గృహిణి ఆత్మహత్యకు కారకులైన ఆ విద్యార్థులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. ఈ కేసులో నిందితులైన యువకుడితోపాటు ఆ ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వారి మొబైల్ ఫోన్లలో ఆత్మహత్యకు పాల్పడిన గృహిణికి చెందిన ఫొటోలే కాకుండా, మరికొంతమంది విద్యార్థినుల ఫొటోలు కూడా ఉన్నట్లు వారు పేర్కొన్నారు.