ఆంధ్రా మాజీ ఎంపీ మనమడి కేసు బెంగళూరు సీసీబీ పోలీసులకు బదిలి, ఆసుపత్రిలో ఎస్కేప్ !
డ్రగ్స్ సేవించి కారు నడిపి ప్రమాదానికి కారణం అయ్యారని ఆరోపిస్తు నమోదు అయిన కేసును బెంగళూరు సీసీబీ పోలీసులకు అప్పగించారు.
బెంగళూరు: డ్రగ్స్ సేవించి కారు నడిపి ప్రమాదానికి కారణం అయ్యారని ఆరోపిస్తు నమోదు అయిన కేసును బెంగళూరు సీసీబీ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో తప్పించుకుని పరారైన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు మాజీ ఎంపీ ఆదికేశవుల నాయుడు మనమడు గీతా విష్ణు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
2017 సెప్టెంబర్ 28వ తేదీ అర్దరాత్రి గీతా విష్ణు డ్రగ్స్ సేవించి కారు నడిపి బెంగళూరు నగరంలోని సౌత్ ఎండ్ సర్కిల్ సమీపంలో మారుతి ఓమ్ని కారును ఢీకొని అనంతరం ట్రాఫిక్ సిగ్నల్ లో ఏర్పాటు చేసిన బోర్డు ఢీకొన్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రమాదంలో మారుతి ఓమ్ని కారులో ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలైనాయి.
ప్రమాదం జరిగిన తరువాత తప్పించుకుని పారిపోతున్న గీతా విష్ణును స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గీతా విష్ణుకు గాయాలు కావడంతో విఠల్ మల్యా రోడ్డులోని మల్యా ఆసుపత్రిలో చేర్పించారు. మరుసటి రోజు ఉదయం ఆసుపత్రిలో గీతా విష్ణు తప్పించుకుని పారిపోయాడు.
మల్యా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సీసీకెమెరాలు పరిశీలించిన పోలీసులు అప్పటి నుంచి గీతా విష్ణు కోసం గాలిస్తున్నారు. గీతా విష్ణు తమిళనాడులో లేదా హైదరాబాద్ లో తలదాచుకుని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గీతా విష్ణు కేసును మంగళవారం సీసీబీ పోలీసులకు అప్పగించడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.