నేను జయలలిత కుమార్తె: మద్రాసు హైకోర్టులో అమృత పిటిషన్, రెడీ టూ ఫైట్ !
చెన్నై/బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తె అంటూ చెబుతున్న బెంగళూరుకు చెందిన అమృత (37) చట్టపరంగా విచారణ ఎదుర్కొవడానికి సిద్దం అయ్యారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతున్న రోజే అమృత మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి విచారణకు స్వీకరించాలని మనవి చేశారు. తనను చంపేస్తామని బెదిరించిన వారికి రెడీ టూ ఫైట్ అంటూ అమృత పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.
జయలలిత కుమార్తె
నేను జయలలిత కుమార్తె, డీఎన్ఏ పరీక్షలు నిర్వహించండి, అమ్మ అంత్యక్రియులు హిందూ సాంప్రధాయం ప్రకారం మళ్లీ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని బెంగళూరుకు చెందిన అమృత ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అక్కడికి వెళ్లండి
అమృత పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు పూర్తి వివరాలు తెలుసుకునింది. మీరు మొదట హైకోర్టుకు వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారని సుప్రీం కోర్టు అమృతను ప్రశ్నించింది. హైకోర్టులో న్యాయం జరగకపోతే ఎవరైనా సుప్రీం కోర్టుకు వస్తారని న్యాయస్థానం గుర్తు చేసింది.
అక్కడ భద్రత లేదు
మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి విచారణ ఎదుర్కొవాలంటే భయంగా ఉందని, ఇప్పటికే చాల మంది తనను బెదిరిస్తున్నారని, తనకు భద్రత లేదని అమృత సుప్రీం కోర్టులో చెప్పారు. మద్రాసు హైకోర్టు కాకుంటే మీరు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు సూచించింది.
అజ్ఞాతంలో అమృత !
తనను చంపేస్తామని చాల మంది బెదిరిస్తున్నారని ఆరోపించిన అమృత తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాను జయలలిత కుమార్తె అని నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాలని అమృత కర్ణాటక హైకోర్టును ఆశ్రయిస్తారాని అందరూ అనుకున్నారు.
షాక్ ఇచ్చిన అమృత
ఎవ్వరూ ఊహించని విధంగా ధైర్యం చేసిన అమృత గురువారం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తాను జయలలిత కుమార్తె అని నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాలని, డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం మీద తమిళనాడులో మరో సారి జయలలిత విషయంలో భారీ చర్చ జరగనుంది.