జయలలిత కుమార్తె: అపోలో ఆసుపత్రికి నోటీసులు ఇచ్చిన అమృత, ఒక్క రోజు తేడా!
బెంగళూరు/చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కుమార్తె నేను అంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన బెంగళూరు అమృత గురువారం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి నోటీసులు జారీ చేసింది. జయలలితకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని అమృత నోటీసులు జారీ చేసింది. జయలలిత మృతి చెందిన తేదీ ఒక్క రోజు తేడా ఉందనే వివాదం మొదలైన మరుసటి రోజు అమృత అపోలో ఆసుపత్రికి నోటీసులు ఇచ్చారు.
అమ్మ బిడ్డను
జయలలిత కుమార్తె నేనే అంటూ బెంగళూరుకు చెందిన అమృత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మీరు హైకోర్టుకు వెళ్లి అక్కడ మీ సమస్య పరిష్కారం కాకపోతే ఇక్కడికి రావాలని, నేరుగా ఇక్కడికే రాకూడదని సుప్రీం కోర్టు అమృతకు సూచించింది.
ధైర్యం చేసిన అమృత !
మద్రాసు హైకోర్టును ఆశ్రయించానికి భయంగా ఉందని అమృత సుప్రీంకోర్టులో చెప్పారు. ఆ సందర్బంలో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు సూచించింది. అయితే కర్ణాటక హైకోర్టును ఆశ్రయించకుండా ధైర్యం చేసిన అమృత మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.
Recommended Video
డీఎన్ఏ పరీక్షలు
జయలలిత కుమార్తె అని నిరూపించుకోవడానికి తనకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని అమృత మద్రాసు హైకోర్టులో మనవి చేశారు. బెంగళూరుకు చెందిన అమృత జయలలిత కుమార్తె అవునా ? కాదా ? అనే విషయం విచారణ చేసి చెప్పాలని మద్రాసు హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.
బెంగళూరులో ఇంటలిజెన్స్
అమృత ఎవరు, ఆమె కుటుంబ సభ్యుల నేపథ్యం ఏమిటి, వారి బంధువులు ఎవరు, ఆమె ఎక్కడ పెరిగింది అనే పూర్తి సమాచారం తెలుసుకోవడానికి తమిళనాడు ఇంటలిజెన్స్ అధికారులు బెంగళూరు చేరుకుని ఆరా తీశారు.
జయలలిత సమాధి !
అమృత జయలలిత కుమార్తె అవునా ? కాదా ? అనే విషయం వెలుగు చూడాలంటే కచ్చితంగా డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలి. జయలలిత సమాధిని తవ్వి ఆమె సాంపిల్స్ సేకరించి అమృతకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని ఆమె న్యాయవాది కోర్టులో మనవి చేశారు.
అపోలోకు నోటీసులు !
జయలలిత అపోలో ఆసుపత్రిలో 75 రోజులు చికిత్సపొంది చివరికి మరణించిన విషయం తెలిసిందే. జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో ఆమె రక్త నమూనాలు, చర్మం, తల వెంట్రుకలు ఏమైనా సేకరించారా ? లేదా ? అనే విషయం చెప్పాలని అపోలో ఆసుపత్రికి అమృత నోటీసులు ఇచ్చారు.
నోటీసులకు సమాధానం !
అమృత ఇచ్చిన నోటీసులకు అపోలో ఆసుపత్రి వర్గాలు ఏమి సమాధానం ఇస్తారో అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక వేళ అపోలో ఆసుపత్రిలో జయలలిత రక్తనమూనాలు, చర్మం, తల వెంట్రుకలు ఉంటే ఆమె సమాధిని తవ్వకుండానే నేరుగా అమృతకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
ఒక్క రోజు తేడా
జయలలిత 2016 డిసెంబర్ 4వ తేదీన మరణించారని, అయితే శాంతి భద్రతల కారణంగా డిసెంబర్ 5వ తేదీ మరణించారని అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయని శశికళ సోదరుడు దివాకరన్ చెప్పిన మరుసటి రోజు అమృత అదే ఆసుపత్రి వర్గాలకు నోటీసులు పంపించి మరో చర్చకు తెరలేపారు.