Lockdown:ఇక ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్డౌన్.. కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం
బెంగళూరు: బెంగళూరులో మళ్లీ సంపూర్ణ లాక్డౌన్ విధించనున్నారా..? రాత్రి వేళల్లో పూర్తి కర్ఫ్యూ విధించనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బెంగళూరు నగరంలో రోజురోజుకూ కరోనావైరస్ కేసులు పెరిగిపోతుండటంతో జూలై 5 నుంచి ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది శనివారం యడియూరప్ప నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి బెంగళూరు నగరం ఇంఛార్జ్ మంత్రి ఆర్ అశోకా కూడా హాజరయ్యారు.
Recommended Video
ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్డౌన్
ఆదివారం రోజున ఎలాంటి కార్యక్రమాలు ఉండవని అన్ని దుకాణాలు షాపింగ్ మాల్స్ను మూసివేయాల్సిందేనని సీఎం యడియూరప్ప చెప్పారు. అయితే నిత్యావసర సేవలు మాత్రం కొనసాగుతాయని వెల్లడించారు. ఇక రాత్రి వేళల్లో కర్ఫ్యూను రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక కూరగాయల కొనుగోలు సమయంలో రద్దీ లేకుండా ఉండేందుకు ఇప్పుడున్న కూరగాయల దుకాణాల సంఖ్యను మరింత పెంచాలని సీఎం యడియూరప్ప బెంగళూరు మహానగర పాలిక కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు.
అంబులెన్స్లను పెంచాలన్న సీఎం
మరోవైపు కోవిడ్-19 పేషెంట్లను హాస్పిటల్స్కు చేర్చేందుకు గాను అంబులెన్స్ సంఖ్యను కూడా పెంచాలని సూచించారు. మృతదేహాలను తీసుకెళ్లేందుకు ప్రత్యేక అంబులెన్స్లు సమకూర్చాలని సీఎం చెప్పారు. అంబులెన్స్ కదలికలపై పోలీసులు ఒక కన్ను వేసి ఉంచాలని చెప్పారు. ఇక నోడల్ ఆఫీసర్ల వివరాల ప్రజలకు చేరవేసేందుకు మీడియాలో ప్రకటనలు ఇవ్వాలని సూచించారు. ఇక సోమవారం నాటికల్లా కోవిడ్-19 పేషెంట్స్ కోసం 10వేల పడకలను బెంగళూరు నగరంలో సిద్ధం చేస్తామని కర్నాటక వైద్యవిద్య శాఖ మంత్రి సుధాకర్ చెప్పారు.
మ్యారేజ్ హాల్స్ రిజర్వ్
ఇక శనివారం జరిగిన సమావేశంలో మరిన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కోవిడ్-19 పేషెంట్స్ కోసం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మ్యారేజ్ హాల్స్, హాస్టల్స్, ఇతర ఇన్స్టిట్యూషన్స్ను సిద్ధం చేయాలని నిర్ణయించడం జరిగింది. అంతేకాదు రైల్వే కోచ్లను కూడా మెడికల్ వార్డుల్లా మార్చాలని డిసైడ్ చేశారు. ఇక మెడికల్ కాలేజీలు, ఇతర ప్రైవేట్ హాస్పటల్స్లో 50శాతం పడకలను కోవిడ్-19 పేషెంట్స్కు కేటాయించాలని సీఎం చెప్పారు. మొత్తానికి బెంగళూరు నగరంను కోవిడ్-19 వణికిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.