మూడు రోజుల్లో గృహప్రవేశం, రద్దు: ఖర్చుల డబ్బు వరద బాధితులకు, ఫ్యామీలి!
బెంగళూరు: కర్ణాటకలోని కొడుగు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలకు ఆ పరిసర ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కొడుగు ప్రజలను ఆదుకోవడానికి రూ. 100 కోట్లు సహాయం చెయ్యాలని కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశారు.
బెంగళూరు నగరంలోని నందిని లేఔట్ లో నివాసం ఉంటున్న ఓ కుటుంబ సభ్యులు కొడుగు వరద బాధితులను ఆదుకోవడానికి వారి ఇంటి గృహప్రవేశం రద్దు చేసుకుని అందుకు ఖర్చు పెట్టాలనుకున్న డబ్బు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు.
నందిని లేఔట్ లో ఆనంద్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. చిన్న వ్యాపారం చేసుకుంటున్న ఆనంద్ ఇటీవల సొంతంగా ఓ ఇంటిని నిర్మించుకున్నారు. వరమహాలక్ష్మి పండగ సందర్బంగా ఇదే నెల 24వ తేదీ గృహప్రవేశం చేసి కొత్త ఇంటిలో అడుగు పెట్టడానికి సిద్దం అయ్యారు.
గృహప్రవేశం సందర్బంగా ఇంటికి వచ్చే బంధువులు, స్నేహితులకు భోజనాలు పెట్టి బహుమతులు ఇవ్వడానికి ఆనంద్ రూ. ఒక లక్షరూపాయలు దాచి పెట్టారు. కొడుగు ప్రాంతంలో భారీ వరదల కారణంగా అతలాకుతలం అయిన విషయం కొన్ని రోజులుగా ఆనంద్ దినపత్రికలు, టీవీలల్లో చూస్తు చలించిపోయారు.
గృహప్రవేశం ఖర్చుల కోసం దాచి పెట్టిన రూ. 1 లక్షను కొడుగు వరద బాధితులకు ఇవ్వాలని ఆనంద్ నిర్ణయించారు. ఈ విషయం ఆనంద్ కుటుంబ సభ్యులకు చెప్పారు. కొడుగు ప్రాంతంలో ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే గృహప్రవేశం సందర్బంగా మనం వంటలు చేసుకుని తినడం మంచిదికాదని వారు నిర్ణయించారు.
ఇంటి యజమాని ఆనంద్ తీసుకున్న నిర్ణయానికి అందరూ ఓకే అన్నారు. ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అధికార నివాసం కృష్ణకు చేరుకున్న ఆనంద్ కుటుంబ సభ్యులు రూ. 1 లక్ష చెక్ ను కొడుగు వరద బాధితుల సహాయనిధికి అందించారు.
తాను చాల కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చానని, ఆకలి విలువ తనకు తెలుసు అని, సమాజం తనకు ఏంతో ఇచ్చిందని, అందులో కొంచెం సమాజం కోసం ఖర్చు చేస్తున్నానని ఆనంద్ మీడియాకు చెప్పారు. గృహప్రవేశం రద్దు అయినా పర్వాలేదని ఆనంద్ అన్నారు.
వరమహాలక్ష్మీదేవికి పూజలు చేసి కొత్త ఇంటిలోకి అడుగు పెడుతామని, తమ దగ్గర డబ్బు ఉన్నప్పుడు బంధువులు, స్నేహితులను పిలిచి ఆ రోజు భోజనాలు పెడుతామని ఆనంద్ అన్నారు. ఆనంద్ కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని సీఎం కుమారస్వామితో పాటు అనేక మంది అభినందిస్తున్నారు.