అనుమానాస్పదం: సరస్సులో శవమై తేలిన ఐటి కంపెనీ పీఆర్ఓ
బెంగళూరు: జన్మదిన వేడుకల్లో పాల్గనేందుకు సోమవారం స్నేహితులతో వెళ్లి అదృశ్యమైన ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పీఆర్ఓ.. గురువారం కేఆర్ పురంలోని ఐటిఐ లేఅవుట్ వద్ద గల సరస్సులో శవమై తేలాడు. మృతుడ్ని బళ్లారికి చెందిన జె ఉమామహేశ్వర(33)గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కెఆర్పురంలో ఉమామహేశ్వర తన భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. అతడు క్యాప్జెమిని ఐటి కంపెనీలో పీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. స్నేహితుడి జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఉమామహేశ్వర సోమవారం నుంచి ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, బుధవారం కెఆర్ పురంలో సమీపంలోని సరస్సు ఒడ్డున ఓ శవం గుర్తించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న కేఆర్ పురం పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సరస్సులో పడిపోయిన అతని బైక్, హెల్మెట్ను బయటికి తీశారు.
అతని వద్ద ఉన్న ఐడి కార్డు సాయంతో అతడు ఉమామహేశ్వరగా గుర్తించారు పోలీసులు. నగర శివారులో జరిగిన స్నేహితుడి జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఉమామహేశ్వర.. పార్టీ అనంతరం కారులు మహాదేవపుర వరకు చేరుకున్నాడు. ఆ తర్వాత అక్కడ పార్క్ చేసిన తన బైక్ తీసుకుని ఇంటికి బయల్దేరాడు. కానీ ఇంటికి చేరుకోలేదు.
మద్యం సేవించి ఉన్నందున ఏదైనా క్యాబ్లో ఇంటికి వెళ్లమని అతని స్నేహితులు సూచించినప్పటికీ.. అతను తన బైక్పైనే వెళ్తానని పట్టుబడినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతడ్ని ఆ స్నేహితులు కూడా కలవలేదని చెప్పారు.
ఐటిఐ సరస్సులో అదుపు తప్పి ఉమామహేశ్వర తన బైక్ తోపాటు పడిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. ఫెన్సింగ్ కూడా లేకపోవడంతో నేరుగా సరస్సులో పడివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అసహజ మరణంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కేఆర్ పురం పోలీసులు తెలిపారు.