తప్పిన భారీ విమాన ప్రమాదం : 32 వేల అడుగుల ఎత్తున పగిలిన అద్దం.. హైదరాబాద్లో అత్యవసర ల్యాండింగ్!
హైదరాబాద్: గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లే బస్సు కిటికీ అద్దాన్ని తెరిస్తే.. గాలి ఎంత విసురుగా కొడుతుందో మనకు తెలుసు. అదే- ఎలాంటి ఆధారమూ లేకుండా గాల్లో 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే విమానం అద్దం పగిలితే.. పరిస్థితేంటి? గాలి వేగానికి మొత్తం విమానమే తలకిందులు అవుతుంది. గాల్లోనే పల్టీలు కొట్టేస్తుంది. బుధవారం ఇంచుమించు అలాంటి అనుభవమే ఏర్పడింది. భూమికి 32 వేల అడుగుల ఎత్తున ప్రయాణిస్తోన్న విమానం అద్దానికి పగుళ్లు ఏర్పడ్డాయి. అంతే- దీన్ని గమనించిన వెంటనే అప్రమత్తమయ్యారు పైలెట్లు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
సుమారు 155 మంది ప్రయాణికులతో బుధవారం తెల్లవారు జామున బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబైకి బయలుదేరింది ఆ విమానం. భూమికి 32 వేల అడుగుల ఎత్తున సుమారు గంటకు 600 కిలోమీటర్ల వేగంతో గమ్యస్థానానికి దూసుకెళ్లసాగింది. ఆ సమయంలో ఓ అద్దానికి పగుళ్లు ఏర్పడ్డాయి. దీన్ని గమనించిన వెంటనే- పైలెట్లు అప్రమత్తం అయ్యారు.
అత్యవసర ల్యాండింగ్ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ సమీపంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సందేశాన్ని పంపించారు. ఏటీసీ నుంచి అనుమతి లభించడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. కిటికీ అద్దాన్ని మార్చిన తరువాతే- విమానం ముంబైకి బయలుదేరి వెళ్తుందని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అథారిటీ వెల్లడించింది. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని తెలియజేసింది.