బెంగళూరు బౌరింగ్ క్లబ్ లాకర్ లో గుజరాత్ వ్యాపారి ఆస్తి విలువ రూ. 800 కోట్లు, బినామిలు!
బెంగళూరు: బెంగళూరులోని బౌరింగ్ ఇన్సిట్యూట్ క్లబ్ లో వ్యాపారవేత్త అవినాష్ అమర్ లాల్ కుక్రోజా అగర్వాల్ లాకర్లలో చిక్కిన ఆస్తుల విలువ రూ. 550 కోట్ల నుంచి రూ. 800 కోట్లకు చేరడంతో ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు షాక్ కు గురైనారు.
బౌరింగ్ క్లబ్ లో వ్యాపారవేత్త అవినాష్ అమర్ లాల్ కుక్రోజా అగర్వాల్ కు చెందిన మూడు లాకర్లను పోలీసుల సమక్షంలో ఐటీ శాఖ అధికారులు పగలగొట్టారు. లాకర్లలో రూ. 3.90 కోట్లు (నగదు), రూ. 7.80 కోట్ల విలువైన వజ్రాలు, నగలు, 650 గ్రాముల బంగారు నగలు, రూ. 15 లక్షల విలువైన ఖరీదైన వాచ్ లు, రూ. వందల కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు, ఖాళీ చెక్ లు స్వాధీనం చేసుకున్నారు.
గుజరాత్ కు చెందిన వ్యాపారవేత్త అవినాష్ అమర్ లాల్ కుక్రోజా అగర్వాల్ కు చెందిన బెంగళూరు, మైసూరులోని ఇళ్లలో సోమవారం సోదాలు జరుగుతున్నాయి. ఒక్క బెంగళూరు నగరంలోని సహకార నగర సమీపంలో రూ. 250 కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమి పత్రాలు ఉన్నాయని ఐటీ అధికారులు అంటున్నారు.
బెంగళూరు టౌన్ హాల్ సమీపంలోని అవినాష్ అమర్ లాల్ కుక్రోజా అగర్వాల్ ఓ కార్యాలయం నిర్వహిస్తున్నాడని, అతనికి బెంగళూరు, మైసూరు నగరాలతో పాటు అనేక ప్రాంతాల్లో ఇండ్లు, అపార్ట్ మెంట్ లు, ఫ్యాక్టరీలు ఉన్నాయని ఐటీ శాఖ అధికారులు అంటున్నారు.
అవినాష్ అమర్ లాల్ కుక్రోజా అగర్వాల్ కు అనేక మంది రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పరిచయాలు ఉన్నాయని ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. బెంగళూరు నగరంలో ఇంకా ఎన్ని క్లబ్ ల్లో అవినాష్ అమర్ లాల్ కుక్రోజా అగర్వాల్ కు సభ్యత్వం ఉంది, అక్కడి లాకర్లలో ఇంకా ఏమైన ఆస్తుల పత్రాలు దాచిపెట్టారా అంటూ ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.