బెంగళూరులో కుప్పకూలిన భవనం, రోజుకొక మృతదేహం బయటకు, ఇంకా ఇద్దరు !
బెంగళూరు: బెంగళూరు నగరంలోని సర్జాపుర రోడ్డులోని కసవనహళ్ళిలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనంలో మరో మృతదేహం బయటపడింది. నాలుగు అంతస్తుల భవనం శిథిలాల్లో గాయాలై మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. మరో ఇద్దరు కార్మికులు శిథిలాల కిందే చిక్కుకున్నారని సాటి కార్మికులు చెప్పడంతో రెస్కూటీం సిబ్బంది శిథిలాలు తొలగించి గల్లంతు అయిన కార్మికుల కోసం గాలిస్తున్నారు.
Recommended Video
రాయచూరు కార్మికుడు
సర్దాపుర రోడ్డులోని కసవనహళ్ళిలో కుప్పకూలిన భవనం శిథిలాల్లో రాయచూరుకు చెందిన రాజుసాబ్ అనే కార్మికుడి మృతదేహం బయటకు తీశారు. భవనం కుప్పకూలడంతో ఇప్పటి వరకూ మరణించిన కార్మికుల సంఖ్య ఐదుకు చేరింది.
ఇద్దరు గల్లంతు
కుప్పకూలిన భవనంలో మొత్తం 22 మంది కార్మికులు పని చేస్తున్నారని సమాచారం. ఐదు మంది మృతి చెందారు. 15 మంది తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. అయితే సాటి కార్మికులు ఇచ్చిన సమాచారం మేరకు ఇంకా ఇద్దరు కార్మికులు గల్లంతు అయ్యారని తెలిసింది.
భార్య, ఇంజనీరు !
గల్లంతు అయిన ఇద్దరు కార్మికుల కోసం శిథిలాలు తొలగించి గాలిస్తున్నామని అగ్నిమాపక సిబ్బంది, రెస్కూ టీం అధికారులు చెప్పారు. భవనం యజమాని రఫిక్ పరార్ అయ్యాడు. అయితే రఫిక్ భార్య సమీరా, బీబీఎంపీ మహదేవపుర విభాగం సీనియర్ ఇంజనీర్ మునిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
భవనం మధ్యలో !
ఐదు సంవత్సరాల క్రితం రఫిక్ భవనం నిర్మాణం చేపట్టాడని అధికారులు అంటున్నారు. అయితే కొన్ని ఆనివార్య కారణాల వలన మధ్యలో భవన నిర్మాణ పనులు నిలిపివేశారని, 20 రోజుల క్రితం మళ్లీ మొదలు పెట్టారని అధికారులు చెప్పారు.
నాసిరకం పునాది
ఫిల్టర్ ఇసుక ఉపయోగించి నాలుగు అంతస్తుల భవనం నిర్మించారని, పునాది కూడా చాల నాసిరకంగా నిర్మించారని అధికారుల విచారణలో వెలుగు చూసింది, నాలుగు అంతస్లుల భవనం నిర్మించడానికి ఇంజనీర్లు రఫీక్ కు అనుమతి ఇచ్చారా ? లేదా ? అని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.