బెంగళూరు సెంట్రల్ జైల్లో సీసీబీ దాడులు, మొబైల్ లు, గంజాయి, కత్తులు, వీకే. శశికళ !
బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు (బెంగళూరు సెంట్రల్ జైలు)ల్లో బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు దాడులు చేశారు. బుధవారం వేకువ జామున నుంచి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో సీసీబీ పోలీసులు సోదాలు చేస్తున్నారు. ప్రతి ఖైదీని సీసీబీ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
కత్తులు సీజ్
సోదాలు చేస్తున్న సీసీబీ పోలీసు అధికారులు 37 సిమ్ కార్డులు, తల్వార్లు, కఠారి (మారణాయుధాలు), గంజాయి, గంజాయి సేవించే పొగగొట్టాలు, మొబైల్ ఫోన్ లు, సిమ్ కార్డులు తదితర నిషేదిత వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ కార్యకలాపాలు
పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కచ్చితమైన సమాచారం అందడంతో సీసీబీ పోలీసు అధికారులు దాడులు చేసి సోదాలు చేస్తున్నారని సమాచారం.
సెల్ ఫోన్లు ఎలా ?
నిత్యం కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఉండే పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో గంజాయి, మారణాయుధాలు, మొబైల్ ఫోన్ లు వెలుగు చూడటంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత ఏఫ్రిల్ నెలలో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో సీసీబీ పోలీసులు సోదాలు చేశారు.
బ్యారెక్. సెల్ లు
ఆ సమయంలో గంజాయి ప్యాకెట్లు, ఆరు మొబైల్ ఫోన్లు, పదుల సంఖ్యలో సిమ్ కార్డులు, నాలుగు కత్తులు తదితర నిషేదిత వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోని ప్రతి బ్యారెక్ లో, సెల్ ల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.
జయలలిత ఫ్రెండ్ శశికళ
ఖైదీలు నిత్యం వేసుకునే దుస్తులో మొబైల్ సిమ్ కార్డులు దాచి పెట్టుకున్నారని వెలుగు చూసింది. గురువారం ఉదయం వరకు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో సోదాలు జరిగే అవకాశం ఉందని సమాచారం. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జే. జయలలిత ప్రాణస్నేహితురాలు వీకే. శశికళ కూడా ఇదే పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.