రూ: 600 కోట్ల చీటింగ్ కేసు, బళ్లారి గాలి జనార్దన్ రెడ్డితో సహ పలువురిపై 4,000 పేజీల చార్జ్ షీట్ !
బెంగళూరు: ఆంబిడెంట్ కంపెనీ రూ. 600 కోట్ల రూపాయల మోసం కేసులో బెంగళూరు సీసీబీ పోలీసులు ప్రత్యేక కోర్టులో చార్జ్ షీట్ సమర్పించారు. ఆంబిడెంట్ కంపెనీ మోసం కేసులో బెంగళూరు సీసీబీ పోలీసులు మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి పేరు నమోదు చేశారు.
ఫరీద్ అనే వ్యక్తి ఆంబిడెంట్ కంపెనీ ఏర్పాటు చేసి అధిక మొత్తంలో వడ్డీ ఇస్తామని ప్రజలను నమ్మించి దాదాపు రూ. 600 కోట్లు వసూలు చేసి మోసం చేశాడని కేసు నమోదు అయ్యింది. ఈ కేసు వ్యవహారంలో అనేక మంది పెద్దల హస్తం ఉందని ఆరోపణలు రావడంతో కేసును సీసీబీ పోలీసులకు అప్పగించారు.
ఆంబిడెంట్ కంపెనీ వ్యవస్థాపకుడు ఫరీద్ ను ఈడీ అధికారులను నుంచి రక్షిస్తానని నమ్మించి రూ. 20 కోట్లు డీల్ కుదుర్చుకున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మీద సీసీబీ పోలీసులు విచారణ చేశారు. గాలి జనార్దన్ రెడ్డిని సీసీబీ పోలీసులు విచారణ చెయ్యడంతో రాజకీయంగా ఈ కేసు పెద్ద చర్చకు దారి తీసింది.
ఆంబిడెంట్ కంపెనీ కేసు విచారణ పూర్తి కావడంతో సీసీబీ పోలీసులు దాదాపు 4,000 పేజీల చార్జ్ షీట్ ను ప్రత్యేక కోర్టులో సమర్పించారు. గాలి జనార్దన్ రెడ్డి, ఆంబిడెంట్ కంపెనీ ఫరీద్ తాజ్ వెస్టెండ్ హోటల్ లో రూ. 20 కోట్లు డీల్ గురించి చర్చించారని ఆరోపణలు రావడంతో హోటల్ సిబ్బంది, గాలి జానర్దన్ రెడ్డి ఇంటి పనిమనుషులు, ఆయన సన్నిహితులను విచారణ చేసి ఆ వివరాలను ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారని సమాచారం.