మైసూరు-చెన్నై మధ్యలో హైస్పీడ్ రైలు: వయా బెంగళూరు, రూ. లక్ష కోట్ల వ్యయం, జర్మనీ ప్రతిపాదన!
బెంగళూరు: మైసూరు- బెంగళూరు- చెన్నై మధ్యలో హైస్పీడ్ రైల్వే నెట్ వర్క్ ( అధిక వేగ రైల్వే వ్యవస్థ ) నిర్మించేందుకు జర్మనీ ప్రభుత్వం ఒక ప్రతిపాదనను రైల్వే బోర్డుకు సమర్పించింది. దీనికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే 2030 నాటికి సాకారం కానుంది. రూ. లక్ష కోట్ల వ్యయంతో ఈ మార్గంలో హైస్పీడ్ రైల్వే నిర్మించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.
జర్మనీ రాయబారి మార్టీన్ నే సాధ్యాసాధ్య అధ్యయన నివేదికను రైల్వేబోర్డు ఛైర్మన్ అశ్వినీ లోహానికి సమర్పించారు. ఈ సందర్బంగా జర్మనీ రాయబారి మార్టీన్ నే మీడియాతో మాట్లాడుతూ మైసూరు-బెంగళూరు- చైన్నై మార్గంలో హైస్పీడ్ రైలులో ప్రయాణించాలంటే కేవలం 2 గంటల 25 నిమిషాల సమయం పడుతుందని అన్నారు.
హైస్పీడ్ రైల్వే నెట్ వర్క్ నివేదికను తయారు చెయ్యడానికి 18 నెలల సమయం పట్టిందని జర్మనీ రాయబారి మార్టీన్ నే అన్నారు. హైస్పీడ్ రైలు నిర్మాణ వ్యయం రూ. లక్ష కోట్లు ఉంటుందని మార్టీనే నే అన్నారు. హైస్పీడ్ రైలు ప్రణాళికకు మూడు సంవత్సరాలు, నిర్మాణానికి తొమ్మిది సంవత్సరాల సమయం పడుతోందని మార్టీన్ నే వివరించారు.
హైస్పీడ్ రైలు నిర్మాణం ప్రారంభం అయితే 2030 నాటికి పూర్తి అయ్యే అవకాశం ఉందని జర్మనీ రాయబారి మార్టీన్ నే వివరించారు. మైసూరు- బెంగళూరు- చెన్నై మార్గంలో 85 శాతం ఎత్తైన మార్గంలో 11 శాతం సొరంగ మార్గంలో హైస్పీడ్ రైలు సంచరిస్తుందని మార్టీన్ నే అన్నారు.
ప్రస్తుతం మైసూరు- బెంగళూరు- చెన్నై మార్గంలో రైలులో ప్రయాణించాలంటే దాదాపు 7 గంటల సమయం పడుతోంది. హైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే దాదాపు 4.30 గంటల సమయం ఆదా అవుతందని అంచనా వేశారు. మైసూరు నుంచి బెంగళూరు మీదుగా చెన్నై వరకు 435 కిలోమీటర్ల దూరం ఉంది.