బెంగళూరులో కాలేజ్ అమ్మాయి, కట్ చేస్తే తమిళనాడులో రాజకీయ నాయకురాలు, ఎన్నికల్లో రాణి హవా !
చెనై/బెంగళూరు: బెంగళూరు కాలేజ్ లో బీబీఎ విద్యాభ్యాసం చేస్తున్న 21 ఏళ్ల యువతి తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి గ్రామ పంచాయితీ అధ్యక్షురాలిగా ఎన్నిక అయ్యారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని కాలేజ్ విద్యార్థిని ఎన్నికల్లో ప్రత్యర్థ పార్టీ నాయకులకు సినిమా చూపించింది. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు, తన మీద పోటీ చేసి ఓడిపోయిన పెద్దల ఆశీర్వాదం తీసుకుని వారి సలహాలు, సూచనలతో ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ది చేస్తానని, విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తానని ఎన్నికల్లో విజయం సాధించిన యువతి అంటోంది.
అక్రమ సంబంధం, భర్త హత్యకు భార్య పక్కాప్లాన్, ప్రియుడితో కలిసి కదులుతున్న రైలు నుంచి తోసేసి!
కర్ణాటక- తమిళనాడు సరిహద్దు
తమిళనాడులో డిసెంబర్ 27, 30వ తేదీల్లో రెండు విడతలుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. పంచాయితీ, గ్రామ పంచాయితీ, జిల్లా పంచాయితీ ఎన్నికల్లో 2.30 లక్షల మందికి పైగా పోటీ చేశారు. బెంగళూరు నగరం శివార్లలోని కర్ణాటక- తమిళనాడు సరిహద్దులోని క్రిష్ణగిరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి.
బెంగళూరు కాలేజ్ అమ్మాయి
క్రిష్ణగిరి జిల్లాలోని కాటినాయకంతొట్టి (కేఎస్ తొట్టి) గ్రామంలో జయసారథి అనే ఆయన నివాసం ఉంటున్నారు. జయసారథి గత గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షుడు అయ్యారు. జయసారథి కుమార్తె సంధ్యారాణి (21) బెంగళూరు నగరంలోని క్రైస్ట్ కాలేజ్ లో బీబీఎ చివరి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తోంది.
మహిళా రిజర్వేషన్
కాటినాయకంతొట్టి గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి మహిళలకు మాత్రమే అవకాశం (రిజర్వేషన్) ఉంది. జయసారథి పోటీ చెయ్యడానికి అవకాశం లేకపోవడంతో తన కుటుంబంలో ఎవరినో ఒకరిని పోటీ చేయించాలని ఆయన నిర్ణయించారు. కాలేజ్ లో చురుకుగా ముందుంటున్న మీ కుమార్తె సంధ్యారాణిని పోటీ చేయించాలని బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు జయసారథికి సలహా ఇచ్చారు.
భారీ మెజారిటి
కాటినాయకంతొట్టి గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసిన సంధ్యారాణికి 1, 170 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి జై సాండియాకు 920 ఓట్లు రావడంతో 210 ఓట్ల భారీ మెజారిటీతో సంధ్యారాణి విజయం సాధించారు. సంధ్యారాణి విజయం సాధించడంతో స్థానిక యువత సంతోషం వ్యక్తం చేస్తోంది.
చదువు పూర్తి చేసి రాజకీయాల్లోకి !
ప్రస్తుతం సంధ్యారాణి బెంగళూరులో బీబీఎ చివరి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తోంది. కాలేజ్ ప్రిన్సిపల్ అనుమతి తీసుకుని ఎన్నికల్లో సంధ్యారాణి పోటీ చేసిందని, చివరి సంవత్సరం కావడంతో చదువు పూర్తి చేసిన తరువాత పూర్తిగా రాజకీయాల్లో ఉంటుందని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. మొత్తం మీద బెంగళూరులో 21 ఏళ్ల కాలేజ్ విద్యార్థిని ఇప్పుడు తమిళనాడులో రాజకీయ నాయకురాలు అయ్యింది.