కొడుకు గూండాగిరి, కాంగ్రెస్ ఎమ్మెల్యే తండ్రి బహిరంగ క్షమాపణ, అహంకారం, సీసీటీవీ!
బెంగళూరు: బెంగళూరు నగరంలోని శాంతినగర నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్.ఏ. హ్యారీస్ తన కొడుకు మోహమ్మద్ హ్యారీస్ నలపాడ్ పబ్ లో యువకుడు విద్వత్ (24) మీద చేసిన దాడికి తాను బహిరంగ క్షమాపణ చెబుతున్నానని బహిరంగ లేఖ రాశారు. తన కుమారుడు మోహమ్మద్ విద్వత్ మీద దాడి చెయ్యడం దురదృష్టకరం అని ఎమ్మెల్యే హ్యారీస్ బహిరంగ క్షమాపణ లేఖ రాశారు. డబ్బు, పలుకుబడి ఉందనే అహంకారంతో దాడి చేశాడని, సీసీకెమెరాలు పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
ఎవ్వరైనా ఒక్కటే
తాను 9 సంవత్సరాల నుంచి శాంతినగర నియోజక వర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేస్తున్నానని హ్యారీస్ అన్నారు. తన నియోజక వర్గం ప్రజలకు, తన కుమారుడికి ఒకే న్యాయం, ఒకే చట్టం, తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష అనుభవించాలని ఎమ్మెల్యే హ్యారీస్ వివరించారు.
మీడియా రాద్దాంతం
శనివారం రాత్రి యూబీ సిటీలోని పబ్ లో విద్వత్ మీద తన కుమారుడు మోహమ్మద్ దాడి చెయ్యడం దురదృష్టకరం, కబ్బన్ పార్క్ పోలీసుల ముందు లొంగిపోవాలని తన కుమారుడికి సూచించాను, మరో సారి విద్వత్, ఆయన కుటుంబ సభ్యులకు తాను బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నానని, ఈ విషయంలో మీడియా రాద్దాంతం చేస్తుందోని ఎమ్మెల్యే హ్యారీస్ అన్నారు.
100 శాతం సహకరిస్తాం
చట్టం ఎవరికైనా ఒక్కటే, తన కుమారుడు మోహమ్మద్ చేసిన దాడికి పోలీసుల విచారణకు తనతోపాటు తన కుటుంబ సభ్యులు వంద శాతం సహకరిస్తామని ఎమ్మెల్యే హ్యారీస్ చెప్పారు. ఇలాంటి కష్ట సమయంలో తనకు అండగా ఉన్న నియోజక వర్గ ప్రజలకు, సన్నిహితులకు ఎమ్మెల్యే హ్యారీస్ ధన్యవాదాలు చెప్పారు.
పబ్ లో విచారణ
ఎమ్మెల్యే హ్యారీస్ కుమారుడు మోహమ్మద్, అతని స్నేహితులను సోమవారం కబ్బన్ పార్క్ పోలీసులు యూబీ సిటీలోని పబ్ దగ్గరకు పిలుచుకుని వెళ్లి ఆ రోజు రాత్రి ఏం జరిగింది, గొడవ ఎలా మొదలైయ్యింది అని విచారణ చేస్తున్నారు.
సీసీ కెమెరాలు
యూబీ సిటీలోని పబ్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. చిన్న విషయంలో గొడవ జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. విద్వత్ మీద దాడి చేశామని ఎమ్మెల్యే కుమారుడు మోహమ్మద్, అతని స్నేహితులు మంజునాథ్ అశ్రఫ్, నాసీర్, అభిషేక్, బాలక్రిష్ణ, అరుణ్ బాబు అంగీకరించారని పోలీసులు అంటున్నారు.
డబ్బు, అహంకారం
డబ్బు, పలుకుబడి ఉంది కదా అనే అహంకారంతో ఎమ్మెల్యే హ్యారీస్ కుమారుడు మోహమ్మద్ అమాయకుడిపై దాడి చేశాడని, అతని మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, రాజకీయ పార్టీ ముసుగులో గూండాలుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.