వలస కార్మికులను బూటు కాలితో తన్నిన పోలీస్..
కరోనా లాక్ డౌన్ వలస జీవుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపించింది. హఠాత్తుగా విధించిన లాక్ డౌన్తో చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా వారి పరిస్థితి తయారైంది. కేంద్ర ప్రభుత్వం వారిని స్వస్థలాలకు తరలించేందుకు అనుమతినిచ్చినప్పటికీ అధికారుల నుంచి అనుమతి పొందేందుకు చాలా కష్టాలు పడాల్సి వస్తోంది. కొన్నిచోట్ల అధికారులు వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కర్ణాటకలోని బెంగళూరులో ఓ పోలీస్ అధికారి వలస కార్మికులను కాలితో తన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కరోనా లాక్ డౌన్ దెబ్బకు అప్పుల్లో తెలంగాణా: కేంద్రం ఆదుకోకుంటే కష్టమే !!
అసలేం జరిగింది..
బెంగళూరులోని కేజీ హల్లి పోలీస్ స్టేషన్కు నిత్యం చాలామంది వలస జీవులు పాసుల కోసం వస్తున్నారు. ఇదే క్రమంలో సోమవారం(మే 11) కూడా పోలీస్ స్టేషన్ ముందు క్యూ కట్టారు. అయితే రాజా సాబ్ అనే ఓ ఏఎస్ఐ కొంతమంది వలస కార్మికులపై చేయి చేసుకోవడమే కాకుండా బూటు కాలితో తన్నుతూ చెదరగొట్టాడు. వారిని దుర్భాషలాడాడు. ఎవరో ఈ ఘటనను సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది.
ఆ అధికారి సస్పెండ్..
వలస కార్మికుల పట్ల దురుసుగా వ్యవహరించిన ఆ పోలీస్ అధికారి వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే అతన్ని సస్పెండ్ చేశారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. పోలీసులు కాస్త సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. కొద్దిరోజుల క్రితం బెంగళూరులోని వార్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ వలస కార్మికులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. లాఠీలతో వారిని చితకబాదడం వివాదాస్పదంగా మారింది.
ఇప్పటికీ కాలి నడకనే ఎంతోమంది..
మొదట్లో వలస కార్మికులను తరలించేందుకు నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ తర్వాత అందుకు అనుమతించింది. బెంగళూరు నుంచి ప్రతీ రోజూ శ్రామిక్ రైళ్లలో వలస కూలీలను స్వస్థలాలకు తరలిస్తున్నారు. అయితే రోజూ కేవలం 1200 మందిని మాత్రమే తరలిస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం నుంచి ఆ సంఖ్యను 1500కి పెంచారు. అయితే పాసులు దొరకని వందలాది మంది వలస కార్మికులు బెంగళూరు నేషనల్ హైవే-44 వెంబడి కాలినడకనే స్వస్థలాలకు వెళ్తున్నారు. ఇందులో జార్ఖండ్,బీహార్,ఉత్తరప్రదేశ్,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందినవారు ఎక్కువమంది ఉన్నారు.