హీరో విజయ్ అరెస్టు, షరతులతో బెయిల్ మంజూరు, విలన్లు జలసమాధి కేసు, ఎస్కేప్!
బెంగళూరు: స్యాండిల్ వుడ్ ప్రముఖ హీరో దునియా విజయ్ ఊపిరిపీల్చుకున్నాడు. కోర్టులో ముందస్తు జామీను మంజూరు కావడంతో దునియా విజయ్, ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ముందస్తు జామీను పత్రాలు వచ్చిన తరువాత పరిశీలించి విజయ్ ని విడుదల చేస్తామని పోలీసులు చెప్పారు.
మాస్తిగుడి సినిమా క్లైమాక్స్ దృశ్యాలు చిత్రీకరిస్తున్న సమయంలో హెలికాప్టర్ లో నుంచి తిప్పగుండనహళ్ళి చెరువులో పడి ప్రముఖ నటులు ఉదయ్, అనీల్ జలసమాధి అయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వలనే నటులు ఉదయ్, అనీల్ జలసమాధి అయ్యారని మాస్తిగుడి సినిమా నిర్మాత సుందర్ పి. గౌడ మీద కేసు నమోదు అయ్యింది.
పోలీసులు అరెస్టు చెయ్యడానికి వెళ్లిన సమయంలో మాస్తిగూడి నిర్మాత సుందర్. పి గౌడ తప్పించుకోవడానికి హీరో విజయ్ సహకరించాడని ఆరోపిస్తూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితం హీరో విజయ్ ని అరెస్టు చెయ్యడానికి వెళ్లిన సమయంలో అతను తప్పించుకున్నాడు.
తమిళనాడులోని రిసార్టులో తలదాచుకున్న హీరో దునియా విజయ్ ను అరెస్టు చేసిన పోలీసులు అతన్ని శుక్రవారం బెంగళూరుకు తీసుకు వచ్చారు. బెంగళూరు నగరంలోని 65వ సెషన్స్ కోర్టులో హీరో విజయ్ కు ముందస్తు జామీను మంజూరు చెయ్యాలని ఆయన న్యాయవాది శివకుమార్ మనవి చేశారు.
కేసు వివరాలు పరిశీలించిన న్యాయమూర్తి మంజునాథ్ ఒకరి సెక్యూరిటీ, రూ. 50 వేల బాండు ఇవ్వాలని ఆదేశించారు. ఒకరి సెక్యూరిటీ, రూ. 50 వేల బాండు కోర్టులో సమర్పించడంతో హీరో విజయ్ కు బెయిల్ మంజూరు అయ్యింది. చెన్నమ్మనే అచ్చుకట్ట పోలీసుల అదుపులో ఉన్న హీరో విజయ్ ని పోలీసు అధికారుల చేతికి జామీను పత్రాలు అందిన తరువాత విడుదల చెయ్యనున్నారు.