డీకే కథ ముగిసినట్టేనా? ఇక కుమారస్వామి వంతు: సమన్లు జారీ చేసిన న్యాయస్థానం
బెంగళూరు: కర్ణాటకలో రాజకీయంగా కాక పుట్టించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డీకే శివకుమార్ ప్రస్తుతం ఎన్ ఫోర్స్ మెంట్ డైనెక్టరేట్ అధికారుల అదుపులో ఉన్నారు. 600 కోట్ల రూపాయలకు పైగా అక్రమంగా ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలపై ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. విచారణ కొనసాగుతోంది. కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివకుమార్ కథ అలా ముగియబోతుండగా.. ఇక జనతాదళ్ (సెక్యులర్) బిగ్ షాట్, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి వంతు వచ్చినట్టుంది. బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు సమన్లు జారీ చేసింది. వచ్చేనెల 4వ తేదీన న్యాయస్థానానికి స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. ఆయనతో పాటు మరో 15 మందికి సమన్లను జారీ చేసింది ప్రత్యేక న్యాయస్థానం.
2007లో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బెంగళూరు శివార్లలోని జాలిగె వడ్డెరహళ్లి గ్రామంలో సుమారు మూడున్నర ఎకరాల స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా డీనోటిఫై చేశారనేది ఆయనపై ఉన్న ఆరోపణ. భారతీయ జనతాపార్టీ కర్ణాటక రాష్ట్ర శాఖ నాయకులు, చామరాజ నగరకు చెందిన మహదేవ స్వామి అనే వ్యక్తి దీనిపై ఫిర్యాదు చేశారు. బెంగళూరు నగరాభివృద్ధి అథారిటీ (బీడీఏ)కు చెందిన స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా డీనోటిఫై చేశారని, ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున ఖజానాకు నష్టం వాటిల్లిందనేది ప్రధాన ఆరోపణ. 2012 నుంచీ ఈ కేసు నానుతూ వస్తోంది. ఆ ఏడాది జూన్ లో తొలిసారిగా ఈ కేసు లోకాయుక్త గడప తొక్కింది. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల వల్ల ఈ కేసు వెలుగు చూడలేదు.
తాజాగా- భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం దీన్ని కోల్డ్ స్టోరేజీ నుంచి బయటికి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ కేసును లోకాయుక్త ప్రత్యేక న్యాయస్థానం సమక్షానికి చేరింది. ఈ కేసును సాధ్యమైంతన తొందరగా మూసేయాలని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం నుంచి లోకాయుక్తకు మౌఖిక ఆదేశాలు వెళ్లినట్లు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని లోకాయుక్త న్యాయస్థానం కుమారస్వామికి తాజాగా సమన్లను జారీ చేసినట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్ అరెస్టు నేపథ్యంలో ఇప్పటికే కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీకే శివకుమార్, కాంగ్రెస్ కు గట్టిపట్టు ఉన్న రామనగర, కనకరపుర, బెంగళూరు రూరల్ వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్లమీదికి వచ్చారు. ధర్నాలు, బంద్ లను నిర్వహించారు. అదే సమయంలో కుమారస్వామి సైతం సమన్లను అందుకోవడం ఆసక్తి రేపుతోంది.