సీఎం వార్నింగ్, పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన ఎమ్మెల్యే కొడుకు, హత్యాయత్నం, జైలు!
బెంగళూరు: యువకుడిపై పబ్ లో, ఆసుపత్రిలో దాడి చేసిన కేసులో బెంగళూరులోని శాంతినగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఏ. హ్యారీస్ కుమారుడు మోహమ్మద్ నలపాడ్ కబ్బన్ పార్క్ పోలీసుల ముందు లొంగిపోయాడు. మోహమ్మద్ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని విచారణ చేస్తున్నారు. మోహమ్మద్ కు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మోహమ్మద్ ను కోర్టు ముందు హాజరుపరిచి జైలుకుం పంపిస్తామని పోలీసులు తెలిపారు.
వ్యాపారవేత్త కొడుకు
బెంగళూరులోని డాలర్స్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రముఖ వ్యాపారి లోక్ నాథ్ కుమారుడు విద్వత్ (24) శనివారం రాత్రి 11 గంటటల సమయంలో యూబీ సిటీలోని పబ్ లో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఏ. హ్యారీస్ కుమారుడు మోహమ్మద్, అతని అనుచరులు అతన్ని చితకబాదేశారు.
ఆసుపత్రికి వెళ్లి దాడి
తీవ్రగాయాలైన విద్వత్ సమీపంలోని మాల్యా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న మోహమ్మద్ అతని అనుచరులు మాల్యా ఆసుపత్రికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించి మళ్లీ ఆసుపత్రిలో దాడి చెయ్యడంతో విద్వత్ సృహతప్పి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
సింగపూర్ లో !
సింగపూర్ లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్వత్ ఇటీవలే బెంగళూరు వచ్చాడు. సోదరుడు సాత్విక్ తో కలిసి శనివారం రాత్రి యూబీ సిటీలోని పబ్ కు వెళ్లిన సమయంలో ఈ గొడవ జరిగింది. ఎమ్మెల్యే హ్యారీస్ కుమారుడు మోహమ్మద్ తీరుపై సీఎం సిద్దరామయ్య, హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులు ఒత్తిడి
విద్వత్ మీద దాడి చేసిన మోహమ్మద్ తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆదివారం రాత్రి మోహమ్మద్ నాన్న హ్మారీస్ తో పాటు తల్లితో మాట్లాడాడు. అమ్మ, నాన్న ఒత్తిడి మేరకు మోహమ్మద్ సోమవారం కబ్బన్ పార్క్ పోలీసుల ముందు లొంగిపోయాడు.
బీజేపీ ధర్నా, లాఠీచార్జ్
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఏ. హ్యారీస్, ఆయన కొడుకు మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వెంటపెట్టుకుని మోహమ్మద్ అక్కడికి వెళ్లారు. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరిగి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.
హత్యాయత్నం కేసు
ఎమ్మెల్యే హ్యారీస్ కుమారుడు మోహమ్మద్ మీద పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మోహమ్మద్ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ ల కింద కేసు నమోదు కావడంతో అతన్ని న్యాయస్థానం ముందు హాజరుపరిచి జైలుకు పంపిస్తామని పోలీసులు తెలిపారు.