Bengaluru గ్యాంగ్ రేప్-వెలుగులోకి షాకింగ్ విషయాలు-బంగ్లా నుంచి వందల కొద్ది మహిళల అక్రమ రవాణా
గత నెలలో బెంగళూరులో వెలుగుచూసిన గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్న కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ ముఠా బంగ్లాదేశ్ నుంచి కొన్ని వందల మంది మహిళలను అక్రమంగా భారత్కు తీసుకొచ్చినట్లు తేలింది. ఉద్యోగాల పేరుతో అమాయక బంగ్లాదేశీ యువతులను బెంగళూరు తీసుకొచ్చి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు శోభుజ్ ఈ వ్యభిచార రాకెట్ వెనుక ప్రధాన సూత్రధారిగా గుర్తించారు.
Recommended Video
బాధితురాలు ఏం చెప్పింది...
గ్యాంగ్ రేప్ ఘటనపై ప్రస్తుతం రామమూర్తి నగర్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బాధితురాలిని విచారించగా... బంగ్లాదేశ్ నుంచి భారత్కు మహిళల అక్రమ రవాణా జరుగుతోందని ఆమె వెల్లడించింది. తనలాగే కొన్ని వందల మంది మహిళలను మాయ మాటలతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ తీసుకొస్తున్నారని తెలిపింది. గ్యాంగ్ రేప్ ఘటనలో ప్రధాన నిందితుడు శోభుజ్.. మహిళల అక్రమ రవాణాలో కీలక సూత్రధారిగా పోలీసులు తేల్చారు. అతని గ్యాంగే బంగ్లాదేశ్ నుంచి భారత్కు అక్రమంగా మహిళలను తీసుకొస్తున్నట్లు గుర్తించారు.
ఉద్యోగాల పేరుతో...
భారత్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి తమను ఇక్కడికి తీసుకొచ్చారని బాధిత యువతి పోలీసులతో వెల్లడించింది. కొన్ని నెలల క్రితం తనతో పాటు కొన్ని వందల మందిని అక్రమంగా బోర్డర్ దాటించారని చెప్పింది. బంగ్లాదేశ్కు చెందిన రఫీక్ అష్రాఫుల్ అనే వ్యక్తి బోర్డర్లో భద్రతా సిబ్బందిని తప్పించుకుని రావడంలో తమకు సాయం చేశాడని తెలిపింది. శోభుజ్ గ్యాంగ్లో అతను కూడా ఒక సభ్యుడని తాను భావిస్తున్నట్లు చెప్పింది.
మొదట హౌరాలో...
అక్రమంగా భారత్లోకి చొరబడ్డ తర్వాత మొదట తమను బెంగాల్లోని హౌరాకి తీసుకెళ్లారని బాధిత యువతి చెప్పింది. అక్కడే తమను కొద్దిరోజుల పాటు ఉంచారని... ఆ సమయంలోనే గుర్తింపు కార్డులను సృష్టించారని పేర్కొంది. ఆపై తమను చిన్న చిన్న గ్రూపులుగా విభజించి వివిధ నగరాలకు తరలించారని తెలిపింది. ఉద్యోగాల పేరుతో తమను ఇక్కడికి తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపారని చెప్పింది. ఈ వ్యభిచార రాకెట్లో వచ్చే డబ్బుల్లో ఎక్కువ భాగం శోభుజ్కే వెళ్తాయని తెలిపింది.
శోభుజ్ గ్యాంగ్పై ఫోకస్
గత నెలలో బెంగళూరులో వెలుగుచూసిన గ్యాంగ్ రేప్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. యువతిని చిత్రహింసలకు గురిచేస్తూ గ్యాంగ్ రేప్కి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈ ఘటన వెలుగుచూసింది. బెంగళూరులోని రామమూర్తి నగర్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. బాధితురాలిని వారి చెర నుంచి విడిపించారు. బాధితురాలు అసోంకి చెందిన యువతిగా మొదట ప్రచారం జరిగినప్పటికీ... ఆమె బంగ్లాదేశ్కి చెందిన యువతి అని ప్రాథమిక దర్యాప్తులోనే గుర్తించారు. తాజాగా బాధితురాలు వెల్లడించిన విషయాల ఆధారంగా... శోభుజ్ గ్యాంగ్పై పోలీసులు ఫోకస్ చేశారు. ఆ గ్యాంగ్లో మొత్తం ఎంతమంది ఉన్నారు... అసలు బంగ్లాదేశ్ నుంచి ఎన్ని గ్యాంగ్స్ భారత్లో మకాం వేశాయి... తదితర వివరాలన్నీ కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు.