కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య, మాజీ మావోయిస్టు విచారణ, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్లు !
బెంగళూరు: ప్రముఖ కన్నడ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసులో పోలీసులు ఓ మాజీ మావోయిస్టును విచారణ చేసి వివరాలు సేకరించారని వెలుగు చూసింది. చిక్కమగళూరు జిల్లా కోప్ప తాలుకా బాళగడి గ్రామంలో గురువారం అర్దరాత్రి మాజీ మావోయిస్టు నీలగుణి పద్మనాభ్ ను విచారణ చేశారని సమాచారం.
చిక్కమగళూరు జిల్లా ఎన్ఆర్ పురం తాలుకాలో బుధవారం పద్మనాభ్ ఆధార్ కార్డు చేయించుకోవడానికి వెళ్లారు. తరువాత పని ముగించుకున్న పద్మనాభ్ బాళగడి గ్రామంలో నివాసం ఉంటున్న సోదరి ఇంటికి వెళ్లాడు. రాత్రి భోజనం చేసి అక్కడే నిద్రపోయాడు.
తరువాత బాళగడి గ్రామానికి వెళ్లిన కోప్ప పోలీసులు పద్మనాభ్ ను ఇంటి నుంచి బయటకు రావాలని చెప్పారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన పద్మనాభ్ ను విచారణ చేసిన పోలీసులు అతని మొబైల్ ఫోన్ తీసుకుని అందులోని నెంబర్లు మొత్తం నోట్ చేసుకుని వెళ్లారని సమాచారం.
కోప్ప పోలీసుల తీరుపై గురువారం పద్మనాభ్ భార్య రేణుక మండిపడ్డారు. ప్రజాస్రవంతిలో కలిసిపోయిన తన భర్త పద్మనాభ్ ను పోలీసులు వేధిస్తున్నారని రేణుక ఆరోపించారు. ఓ టీవీ చానల్ లో చర్చాగోష్టి కార్యక్రమానికి తన భర్తను గౌరీ లంకేష్ తీసుకెళ్లారని, ఆ విషయం అడ్డం పెట్టుకుని ఇప్పుడు తన భర్త పద్మనాభ్ ను పోలీసులు వేధిస్తున్నారని రేణుక ఆరోపించారు. ఈ విషయంపై పోలీసు అధికారులు మాత్రం ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.