కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య: బీజేపీ నాయకుడి పోలికలు, ఊహాచిత్రంపై సిట్ వివరణ !
ప్రముఖ కన్నడ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ముగ్గురు నిందితుల ఊహాచిత్రాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.
బెంగళూరు: ప్రముఖ కన్నడ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ముగ్గురు నిందితుల ఊహాచిత్రాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురి ఊహాచిత్రాల్లో ఒక వ్యక్తి నుదటి మీద తిలకం పెట్టుకున్న ఊహాచిత్రం వివాదానికి కారణం కావడంతో సిట్ అధికారులు వివరణ ఇచ్చారు.
గౌరీ లంకేష్ హత్య కేసు విచారణ చేస్తున్న సిట్ అధికారులు ఆమె తల్లిని విచారణ చేశారు. నుదుటి మీద తిలకం పెట్టుకున్న అనుమానాస్పద వ్యక్తి మా ఇంటికి వచ్చారని గౌరీ లంకేష్ తల్లి చెప్పారని, ఆమె ఇచ్చిన సమాచారం మేరకే ఊహాచిత్రం గీయించామని సిట్ అధికారులు అంటున్నారు.
తుమకూరు గ్రామీణ శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే (బీజేపీ) సురేష్ గౌడ వ్యక్తి గత సహాయకుడు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త, బీజేపీ నాయకుడు ప్రభాకర్ ను పోలినట్లు అచ్చం అలాగే ఊహాచిత్రం ఉంది. ఈ సందర్బంలో అనేక మంది ప్రభాకర్ కు ఫోన్ చేసి ఏమిటి విషయం అని ఆరా తియ్యడం మొదలు పెట్టారు.
రెండు రోజుల నుంచి కన్నడ మీడియాలో నుదుటి మీద తిలకం పెట్టుకున్న వ్యక్తి ఊహాచిత్రం, ప్రభాకర్ ఫోటో మీదే ఎక్కువగా వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఈ సందర్బంలో గౌరీ లంకేష్ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఆ ఊహాచిత్రం ఎలా గీయించామో వివరణ ఇచ్చారు.