కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య, నెల నుంచి హంతకుల నిఘా, హోం మంత్రితో భేటీకి !
బెంగళూరు: కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని ఎస్ఐటీ అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. నెల రోజుల నుంచి ప్రతి రోజూ గౌరీ లంకేష్ ఎక్కడికి వెలుతున్నారు, ఏం చేస్తున్నారు అని హంతకులు క్షుణ్ణంగా పరిశీలించారని వెలుగు చూసింది.
ప్రభుత్వ లాంచనాలతో గౌరి లంకేష్ అంత్యక్రియలు, సీఎం, మంత్రులు హాజరు!
నెల రోజుల నుంచి తన కదలికలను గుర్తు తెలియని వ్యక్తులు పరిశీలిస్తున్నారని తెలుసుకున్న గౌరీ లంకేష్ ఆ విషయం ఆమె తల్లికి చెప్పారు. తనకు ప్రాణహాని ఉందని ఊహించిన గౌరీ లంకేష్ 15 రోజుల క్రితం రాజరాజేశ్వరి నగర్ లోని తన ఇంటికి సీసీకెమెరాలు ఏర్పాటు చేశారు.
గత సోమవారం (సెప్టెంబర్ 3వ తేది) కర్ణాటక హోం శాఖ మంత్రిని కలవడానికి గౌరీ లంకేష్ ప్రయత్నించారు. చివరి నిమిషంలో అదిసాధ్యంకాలేదు. హోం శాఖ మంత్రిని కలిసి ఉంటే తనకు ప్రాణహాని ఉందనే విషయం ఆమె చెప్పేవారని పోలీసు అధికారులు అంటున్నారు.
ఎడిటర్ గౌరి లంకేష్: నివేదిక అడిగిన కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీబీఐ విచారణ!
గాంధీ బజార్ లోని లంకేష్ పత్రిక కార్యాలయం నుంచి గౌరీ లంకేష్ ఎప్పుడు బయలుదేరుతున్నారు ? ఎప్పుడు కార్యాలయానికి వస్తున్నారు ? ఇతర ప్రాంతాలకు వెలుతున్నారా, లేదా ? అని పూర్తి సమాచారం తెలుసుకోవడానికి నిందితులు ఒక నెల రోజులుగా పక్కా సమాచారం సేకరించారని తెలిసింది.
మంగళవారం రాత్రి గాంధీ బజార్ లోని లంకేష్ పత్రిక కార్యాలయం నుంచి గౌరీ లంకేష్ ను వెంబడించిన నిందితులు చివరికి ఆమెను రాజరాజేశ్వరినగర్ లోని ఇంటి ముందే దారుణంగా కాల్చి చంపేశారు. తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ముందుగానే గౌరీ లంకేష్ ఫిర్యాదు చెయ్యకపోవడంతో చివరికి జరగరాని నష్టం జరిగిపోయింది.