బెదిరింపు ప్లాన్ బెడిసికొట్టింది: చివరికి ప్రాణమే పోయింది
తల్లిదండ్రులను బెదిరించాలనుకున్న ఓ యువతి వారి కళ్ళెదుటే ఆత్మహత్య నాటకం ఆడబోయి, అనుకోకుండా అది నిజమవడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇది.
బెంగళూరు: కళాశాల నుంచి ఇంటికి రావడంలో ఆలస్యం ఎందుకైందని ప్రశ్నించిన తల్లిదండ్రులను బెదిరించాలనుకున్న ఓ యువతి వారి కళ్ళెదుటే ఆత్మహత్య నాటకం ఆడబోయి, అనుకోకుండా అది నిజమవడంతో ప్రాణాలు కోల్పోయిన ఉదంతమిది.
బెంగళూరులోని బ్యాతరాయనపురకు చెందిన వ్యాపారి రమేష్ కుమార్తె కీర్తన(18) మైసూరు రోడ్డులోని ఓ ప్రైవేటు కళాశాలలో ప్రీ యూనివర్సిటీ కోర్సు చదువుతోంది. బుధవారం సాయంత్రం ఇంటికి ఆలస్యంగా వచ్చింది.
కీర్తన తరచూ ఆలస్యంగా రావడం గమనించిన ఆమె తల్లిదండ్రులు ఎందుకింత ఆలస్యం అయిందని ప్రశ్నించారు. ఇందుకు ఆగ్రహించిన కీర్తన మళ్ళీ ఇంకోసారి తనను ఇలా అనుమానిస్తే ఉరేసుకుని చస్తానని బెదిరిస్తూ వారి కళ్ళెదుటే ఆ ప్రయత్నానికి ఒడిగట్టింది.
అయితే అనుకోకుండా తాడు మెడకు గట్టిగా బిగుసుకుపోవడంతో ఊపిరి ఆడలేదు. స్పృహ కోల్పోయిన కీర్తనను తల్లిదండ్రులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
అప్పటికే కీర్తన మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఆవేశంలో చేసిన పని ఇలా పెద్ద అనర్ధానికి దారితీయడం స్థానికులని కలచివేసింది.