రూ. 400 కోట్ల IMA scam: ఐఏఎస్ అధికారి ఆత్మహత్య, అసలేం జరిగింది?
బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన ఐఎంఏ కుంభకోణంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి విజయ్ శంకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం బెంగళూరులోని జయానగర్లో తన ఫ్లాట్లో ఉరివేసుకున్నారు. ఐఏఎస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది.
రూ. 400 కోట్ల ఐ మానెటరీ అడ్వైజరీ(ఐఎంఏ) కుంభకోణంలో లంచం తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా క్లీన్ చిట్ ఇచ్చినట్లు విజయ్ శంకర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ స్కాంలో ప్రధాన నిందితుడైన మన్సూర్ ఖాన్ నుంచి కోటిన్నర లంచం తీసుకుని క్లీన్ చిట్ ఇచ్చినట్లు విజయ్ శంకర్ పై సీబీఐ చేసిన ప్రధాన అభియోగం.
ఈ కేసులో 2019, జులై 8న విజయ్ శంకర్ ను అరెస్ట్ చేశారు. పొరప్పానలోని ఆగ్రహార జైలులో విచారణ ఖైదీగా ఉన్న విజయ్ శంకర్.. జులై 27న సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతోపాటు మరో ఇద్దరు నిందితులకు కూడా బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో ఐఏఎస్ విజయ్ శంకర్ తోపాటు మరో ఇద్దరినీ విచారించేందుకు రెండు వారాల కింద కర్ణాటక ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో విజయ్ శంకర్ ఒక్కసారిగా బలవన్మరణానికి పాల్పడటం సంచలనంగా మారింది.
Recommended Video
కాగా, ఐఎంఏ జువెల్లర్స్ పేరుతో నిందితుడు మన్సూర్ ఖాన్.. భారీ మొత్తంలో వడ్డీలు చెల్లిస్తామని ఆశ చూపి రూ. 400 కోట్లకుపైగా డబ్బును డిపాజిట్ల రూపంలో సేకరించాడు. అనంతరం బోర్డు తిప్పేశాడు. సుమారు 50వేల మంది డిపాజిటర్లకు ఈ సంస్థపై, దాని యజమాని మన్సూర్ ఖాన్పై పోలీసులకు ఫిర్యాదు అందడంతో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఐఏసఎస్ మరణం పలు అనుమానాలకు తావిస్తోంది.