హిందూపురానికి వందే మెట్రో ఎక్స్ప్రెస్ - బెంగళూరు నుంచి..!!
రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన వందే మెట్రో రైళ్లు త్వరలో పట్టాలెక్కబోతోన్నాయి. తొలి రైలును బెంగళూరు దక్కించుకోబోతోంది. 100 కిలోమీటర్ల దూరంలో ఉండే పట్టణాల మధ్య ఈ రైలును నడిపించనున్నారు అధికారులు.
న్యూఢిల్లీ: ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోన్న అంశం- వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు. పలు రాష్ట్రాల్లో ఈ రైళ్లు పట్టాలెక్కాయి. ఇప్పటివరకు ఎనిమిది రైళ్లు వివిధ నగరాల మధ్య రాకపోకలు సాగిస్తోన్నాయి. ఈ సిరీస్ లో ఎనిమిదో రైలు సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య తిరుగాడుతోంది. మిగిలిన రైళ్లతో పోల్చుకుంటే గరిష్ఠంగా మూడింతల వేగంతో- పరుగులు పెడుతోండటంతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోన్నాయి ఇవి.
జనాదరణతో..
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. వాటి వెయిటింగ్ లిస్ట్ భారీగా ఉంటోంది. ఇతర ఎక్స్ ప్రెస్ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ల రేట్లు రెట్టింపు అయినప్పటికీ ప్రయాణికులు ఏ మాత్రం తగ్గట్లేదు. సమయం, వేగానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. వివిధ నగరాల మధ్య వందలాది కిలోమీటర్ల మేర రాకపోకలు సాగించే విషయంలో సమయానికి గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో వందే భారత్ రైళ్లపై ఆధారపడుతున్నారు.
మరిన్ని రైళ్లు..
ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం- కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వాటి సంఖ్యను పెంచనుంది. ఈ మేరకు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలను పంపించాలని ఆదేశించింది. దీనిపై రైల్వే బోర్డు కసరత్తు పూర్తి చేశారు. రాజధాని నగరం నుంచి 100 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉండే పట్టణాల మధ్య దీన్ని పట్టాలెక్కించాలనేది రైల్వే మంత్రిత్వ శాఖ లక్ష్యం. దీనికి అనువుగా ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది రైల్వే బోర్డు.
వందే మెట్రో..
ఈ క్రమంలో చిన్నస్థాయి నగరాల మధ్య రాకపోకలు సాగించడానికి అనువుగా మినీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నడిపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎనిమిది బోగీలు మాత్రమే ఉండేలా దీన్ని డిజైన్ చేసింది రైల్వే బోర్డు. దీనికి వందే మెట్రో సర్వీసులుగా పిలుస్తోంది. ఇప్పుడున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ఉండే బోగీల సంఖ్య 16. ఇందులో రెండు ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్స్ కాగా.. మిగిలినవన్నీ సాధారణమైనవి.
తొలి రైలు బెంగళూరుకు..
దేశంలో మొట్టమొదటి వందే మెట్రో రైలును కేంద్ర ప్రభుత్వం బెంగళూరుకు కేటాయించనుంది. ఈ విషయాన్ని నైరుతి రైల్వే అధికారి జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ తెలిపారు. బెంగళూరు నుంచి 100 కిలోమీటర్ల లోపు ఉన్న పట్టణాల మధ్య దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. బెంగళూరు- తుమకూరు లేదా బెంగళూరు- హిందూపురం మార్గాలు తమ పరిశీలనలో ఉన్నాయని, ఈ రెండింట్లో ఎంపిక చేసిన ఒక మార్గంలో వందే మెట్రో రైలును అందుబాటులోకి తీసుకుని వస్తామని చెప్పారు.
కొత్త టెర్మినల్స్ లేవు..
అత్యంత రద్దీతో కూడుకుని ఉండే బెంగళూరు-మైసూరు మార్గంలో గల హెజ్జాల రైల్వే స్టేషన్ ను కొత్త టెర్మినల్ గా తీర్చిదిద్దే ప్రతిపాదనలు ఏవీ లేవని సంజీవ్ కిశోర్ చెప్పారు. ప్రయాణికుల తాకిడి అధికంగా ఉండే క్రాంతివీర సంగోళి రాయన్న బెంగళూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. రైల్వే లైన్ల డబ్లింగ్, ట్రిప్లింగ్, వందే భారత్ రైళ్ల నిర్వహణ కోసం మౌలిక సదుపాయాల కల్పన వంటి ప్రాజెక్టులు తమ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ కు మంజూరు అయ్యాయని చెప్పారు.