బెంగళూరులో ప్రభుత్వ కార్యాలయంలో పెట్రోల్ చల్లిన కాంగ్రెస్ లీడర్, కాల్చేస్తా, సీఎం!
బెంగళూరు: బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు గూండాల కంటే దారుణంగా తయారైనారని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు. బెంగళూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హ్యారీస్ కుమారుడు మోహమ్మద్ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసిన వెంటనే అదే పార్టీకి చెందిన మరో నాయకుడి బరితెగింపు బయటకు వచ్చింది. ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలోకి చొరబడి అధికారులు, సిబ్బంది అక్కడే ఉన్న సమయంలో పెట్రోల్ చల్లి నిప్పటించడానికి ప్రయత్నించిన వీడియో బయటకు వచ్చి వైరల్ కావడంతో సీఎం సీరియస్ అయ్యారు.
ఎమ్మెల్యే రైట్ హ్యాండ్
బెంగళూరు నగరంలోని కేఆర్ పురం శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే (కాంగ్రెస్) భైరతి బసవరాజ్ కు ప్రధాన అనునచరుడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారి నారాయణస్వామి గుర్తింపు తెచ్చుకున్నాడని సమాచారం. కేఆర్ పురం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నారాయణస్వామి పని చేస్తున్నాడు.
నకిలీ ఖాతా చెయ్యాలి
హోరమావు బీబీఎంపీ కార్యాలయానికి వెళ్లిన నారాయణస్వామి పకిలీ ఖాతా చెయ్యాలని అధికారుల మీద ఒత్తిడి తీసుకు వచ్చాడని తెలిసింది. అయితే అధికారులు చట్టానికి వ్యతిరేకంగా నకిలీ ఖాతా చెయ్యడానికి నిరాకరించారని సమాచారం.
పెట్రోల్ తీసుకెళ్లి!
ఫిబ్రవరి 16వ తేదీన నారాయణస్వామి బాటిల్ లో పెట్రోల్ తీసుకుని బీబీఎంపీ కార్యాలయానికి వెళ్లాడు. తరువాత వీఆర్ఓ చెంగలరాయప్ప, అధికారులు, సిబ్బందిని బెదిరించాడు. అదే సమయంలో ప్రభుత్వ కార్యాలయంలోని ఫర్నీచర్, రికార్డులు భద్రపరచిన బీరువాల మీద పెట్రోల్ చల్లి నిప్పంటించడానికి ప్రయత్నించాడు.
భయంతో అధికారి బదిలి
వీఆర్ ఓ, సిబ్బందిని మీరు మర్యాదగా కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోండి, నాకు ఇక్కడ చాలాపని ఉందని నారాయణస్వామి బెదిరిస్తున్న సమయంలో ఒకరు మొబైల్ లో వీడియో తీశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు నారాయణస్వామికి భయపడిన వీఆర్ ఓ చెంగలరాయప్ప బలవంతంగా మహదేవపుర బీబీఎంపీ కార్యాలయానికి బదిలీ చేయించుకున్నారు.
అసెంబ్లీలో రచ్చరచ్చ
నారాయణస్వామి ప్రభుత్వ కార్యాలయంలో పెట్రోల్ చల్లిన వీడియో మంగళవారం బయటకు వచ్చి వైరల్ అయ్యింది. శాసన సభ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై కర్ణాటక మాజీ సీఎం జగదీష్ శెట్టర్ విరుచుకుపడటంతో రచ్చరచ్చ అయ్యింది. సీఎం సిద్దరామయ్య ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరు సంవత్సరాలు నారాయణస్వామిని బహిష్కరిస్తున్నామని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర్ ఆదేశాలు జారీ చేశారు.
అరెస్టు చెయ్యండి, సీఎం
నారాయణస్వామిని వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బెంగళూరు నగర పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు బీబీఎంపీ ఉద్యోగుల నుంచి ఫిర్యాదు స్వీకరించి విచారణ చేస్తున్నారు.
ఏందీ పంచాయితీ
శాసన సభ ఎన్నికల సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై సీఎం సిద్దరామయ్య అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏందీ పంచాయితీ, మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను సీఎం సిద్దరామయ్య హెచ్చరించారని తెలిసింది.