ఐబిఎం మహిళా టెక్కీ హత్య: నిందితుడు ఇతడే(ఫొటో)
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఉద్యోగిని కుసుమ్ రాణి సింగ్లా కేసును పోలీసులు ఛేదించారు. సోషల్మీడియాలో పరిచయమైన వ్యక్తే కుసుమ్ని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
వివరాల్లోకి వెళితే.. కుసుమ్ సింగ్లా(31) బెంగళూరులోని ఐబీఎం కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు మూడు నెలల క్రితం సోషల్మీడియా ద్వారా సుఖ్బీర్ సింగ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. మంగళవారం సుఖ్బీర్ని తన ఇంటికి రావాల్సిందిగా కుసుమ్ కోరింది.
ఆమె కోరిక మేరకు అక్కడికి వచ్చిన సుఖ్బీర్.. తనకు రూ.50వేలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. తన వద్ద లేవని ఆమె చెప్పడంతో కనీసం రూ.5వేలు ఇవ్వాల్సిందిగా అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో.. ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది.
ఈ నేపథ్యంలో సుఖ్బీర్ ల్యాప్టాప్ వైరుతో కుసుమ్ మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా మొదట దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఆ తర్వాత ఆమె సోషల్మీడియా ఖాతా ద్వారా దర్యాప్తు చేశారు.
గురువారం ఉదయం హర్యాలో సుఖ్బీర్ పోలీసులకు చిక్కాడు. అతనిని విచారించగా.. నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. గురువారం సాయంత్రానికల్లా నిందితుడ్ని బెంగళూరుకు తీసుకురానున్నట్లు తెలిపారు. కాగా, సుఖ్బీర్ 2013 నుంచి ఏ పని చేయకుండానే జీవితాన్ని వెల్లదీస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉండగా, కుసుమాకు గతంలో వివాహం అయ్యింది. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి వేరుగా నివాసం ఉంటోంది. మళ్లీ పెళ్లి చేసుకోవాలని పలు వెబ్ సైట్లలో ప్రకటనలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వెబ్ సైట్లో పరిచయం అయిన సుఖ్బీర్.. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. ఆ తర్వాత ఈ ఘోరానికి పాల్పడ్డాడు.