దారుణం... కూతురిపై కన్నతండ్రి అత్యాచారం... దగ్గు మందు అని చెప్పి...
కర్ణాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది. కన్నతండ్రే తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దగ్గు మందు పేరుతో నిద్ర మాత్రలు ఇచ్చి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లాక అత్యాచారం చేశాడు. మరుసటిరోజు తెల్లవారుజామున నిద్ర లేచేసరికి... తండ్రి తన పక్కనే ఉండటం... తను ఎలాంటి స్థితిలో ఉన్నానో చూసుకుని బాధితురాలు షాక్కి గురైంది. తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించింది.
అత్యాచారం తర్వాత నిద్రపోయావా... భారతీయ మహిళలు అలా ఉండరే...
దగ్గు వస్తుందని చెబితే...
బెంగళూరులోని హరలూర్ ప్రాంతంలో 19 ఏళ్ల ఓ బాలిక తన తండ్రి,సవతి తల్లితో కలిసి నివసిస్తోంది. ఇటీవల ఆ బాలిక దగ్గు,జలుబు బారినపడి ఇబ్బంది పడుతోంది. మంగళవారం(జూన్ 23) రాత్రి ఇదే విషయాన్ని తండ్రికి చెప్పింది. దీంతో తండ్రి దగ్గు మందు అని చెప్పి నిద్ర మాత్రలు తెచ్చిచ్చాడు. పాపం తండ్రి దురుద్దేశం తెలియక బాలిక ఆ మాత్రలు వేసుకుంది.
కన్న కూతురు అని కూడా చూడకుండా....
మాత్రలు వేసుకున్న తర్వాత బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో... తండ్రి కామంతో రెచ్చిపోయాడు. కూతురు అన్న కనీస మానవత్వం లేకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచేసరికి.. తన పక్కనే తండ్రి పడుకుని ఉండటం,తన వాలకం చూసుకుని ఆమె షాక్ తిన్నది. తనపై తండ్రి అత్యాచారం చేశాడని గ్రహించేందుకు ఎంతో సమయం పట్టలేదు.
సవతి తల్లికి చెప్పినా...
తండ్రి ఘాతుకం గురించి సవతి తల్లికి చెప్పగా... ఆమె అంతగా పట్టించుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన బాలిక టాయిలెట్ క్లీన్ చేసే కెమికల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. అదే స్థితిలో స్థానిక పోలీస్ స్టేషన్ వద్దకు పరిగెత్తి.. వారికి అసలు విషయం చెప్పింది. దీంతో పోలీసులు వెంటనే ఆమెను సెయింట్ జాన్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు తండ్రిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
పంజాబ్లోనూ ఇలాంటి ఘటనే...
ఇలాంటిదే మరో ఘటన పంజాబ్లో జరిగింది. 11 ఏళ్ల కూతురిపై ఓ తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలికకు 8 ఏళ్ల వయసున్నప్పటి నుంచే ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నట్టు తెలిసింది. ఇంట్లో భార్య లేని సమయంలో కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవల బాలికకు తీవ్ర కడుపు నొప్పి రావడంతో అసలు విషయం బయటపడింది. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.