ఎమ్మెల్యే సౌమ్యా రెడ్డికి బంపర్ ఆఫర్: సినీ స్టార్స్ నగ్మా, కుష్బు, రాజీనామా దెబ్బ, భలేచాన్స్!
బెంగళూరు: బెంగళూరు నగరంలోని జయనగర శాసన సభ నియోజక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే సౌమ్యా రెడ్డిని తమిళనాడు మహిళా కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ గా నియమిస్తూ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడులో సినీ స్టార్స్ కుష్బు, నగ్మాలతో కలిసి సౌమ్యా రెడ్డి పని చెయ్యనున్నారు. ఐదు రాష్ట్రాలకు మహిళా కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ లుగా నియమించింది. సోనియా గాంధీ ఆదేశాలతో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ సుస్మితా దేవ్ తమిళనాడు ఇన్ చార్జ్ గా సౌమ్యా రెడ్డిని నియమించారు. జర్నలింజం చదివిన సౌమ్యా రెడ్డి తండ్రి బాటలో రాజకీయాల్లోకి వచ్చారు.
తమిళనాడుకు అవసరం !
తమిళనాడులో కాంగ్రెస్ పార్టీని మరింత భలోపేతం చెయ్యడానికి మహిళా విభాగం పని చేస్తోందని, ఆ విభాగాన్ని మీరు మరింత భలోపేతం చెయ్యాలని, పార్టీ అభివృద్ది కోసం మీరు కృషి చెయ్యాలని, ఆ దిశగా అన్ని ప్రయత్నాలు చెయ్యాలని సుస్మితా దేవ్ జయనగర ఎమ్మెల్యే సౌమ్యా రెడ్డికి సూచించారు.
సోనియా, రాహుల్ గాంధీ
తమిళనాడు మహిళా కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ గా తనను నియమించిన సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ కు జయనగర్ ఎమ్మెల్యే సౌమ్యా రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీని భలోపేతం చెయ్యడానికి శక్తి వంచనలేకుండా పని చేస్తానని సౌమ్యా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
నా మీద నమ్మకం
తన మీద ఎంతో నమ్మకంతో తమిళనాడు మహిళా కాంగ్రెస్ విభాగం ఇన్ చార్జ్ గా నియమించారని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటానని సౌమ్యా రెడ్డి అన్నారు. తమిళనాడుతో పాటు కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ది కోసం కృషి చేస్తానని సౌమ్యా రెడ్డి చెప్పారు.
రాజీనామా ఎఫెక్ట్
కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, బెంగళూరులోని బీటీఎం లేఔట్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి. కర్ణాటకలో అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన రామలింగా రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో సౌమ్యా రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే సోనియా గాంధీ ఆదేశాలతో సౌమ్యా రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అదే సమయంలో సోనియా గాంధీతో సౌమ్యా రెడ్డి భేటీ అయ్యారు. తన తండ్రికి మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించారని సౌమ్యా రెడ్డి సోనియా గాంధీకి చెప్పారు. ఆ సమయంలో కీలక పదవి ఇస్తానని రాజీనామాలు చెయ్యరాదని సోనియా గాంధీ ఎమ్మెల్యే సౌమ్యా రెడ్డికి హామీ ఇచ్చారని సమాచారం.
సినీ తారలు కుష్బు, నగ్మా
తమిళనాడులో కాంగ్రెస్ పార్టీని భలోపేతం చెయ్యడానికి ప్రముఖ సినీ తారలు కష్బు, నగ్మా పని చేస్తున్నారు. మహిళా విభాగం జాతీయ నాయకురాలిగా నగ్మా, తమిళనాడు నాయకురాలిగా కుష్బు తమకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ సినీ తారలు కష్బు, నగ్మాతో కలిసి ఇప్పుడు సౌమ్యా రెడ్డి కూడా పని చెయ్యడానికి సిద్దం అయ్యారు.
జయనగర్ లో సౌమ్యా రెడ్డి
2018 శాసన సభ ఎన్నికల్లో బెంగళూరులోని జయనగర శాసన సభ నియోజక వర్గం నుంచి సౌమ్యా రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సౌమ్యా రెడ్డికి 54, 457 ఓట్లు వచ్చాయి. బీజేపీ నుంచి బరిలోకి దిగిన ప్రహ్లాద్ కు 51, 568 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్ మీద సౌమ్యా రెడ్డి విజయం సాధించారు. జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సౌమ్యా రెడ్డికి ఇప్పుడు తమిళనాడు ఇన్ చార్జ్ భాద్యతలు అప్పగించారు.