ఇంటి దొంగను సంవత్సరం తరువాత పట్టించిన బంగారు నగల వాట్సాప్ ఫోటో !
బెంగళూరు: ఇంటి యజమాని కళ్లుగప్పి బంగారు నగలు చోరీ చేసిన మహిళ సంవత్సరం తరువాత వాట్సాప్ లో ఓ ఫోటో అప్ లోడ్ చేసి అడ్డంగా పోలీసులకు చిక్కిపోయింది. కవితా బాయి అనే మహిళను అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు ఆమెను విచారణ చేస్తున్నారు.
బెంగళూరు మెజస్టిక్ సమీపంలోని శ్రీరాంపురలో సత్యనారాయణ రావ్ అనే ఆయన భార్యతో కలిసి నివాసం ఉంటున్నారు. సత్యనారాయణ రావ్ ఇంటిలో కవితా బాయి నెలకు రూ. 15,000 జీతానికి గతంలో ఇంటి పని చేసేది.
2017 మే 10వ తేదీన సత్యనారాయణ రావ్ భార్యకు అనారోగ్యంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సందర్బంలో కవితా బాయి సత్యనారాయణ రావ్ ఇంటి నుంచి ఆసుపత్రికి తిరిగేది. ఆ సమయంలో బీరువా తాళం సేకరించిన కవితా బాయి దానితో నకిలి తాళాలు తయారు చేయించుకుంది.
సత్యనారాయణ రావ్ భార్య ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే కవితా బాయి నకిలి తాళాలు ఉపయోగించి బంగారు నగలు, వెండి వస్తువులు చోరీ చేసింది. తన మీద అనుమానం రాకుండా బాల్కని తలుపులు తీసి పెట్టి ఆసుపత్రి దగ్గరకు వెళ్లింది.
రెండు రోజుల తరువాత ఇంటికి వెళ్లిన సత్యనారాయణ రావ్ బీరువాలో నగలు మాయం అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యనారాయణ రావ్ కు ఇంటి పనిమనిషి కవితా బాయి మీద ఎలాంటి అనుమానం రాలేదు.
రెండు నెలల తరువాత సత్యనారాయణ రావ్ భార్య మరణించింది. తరువాత కవితా బాయి సైతం సత్యనారాయణ రావ్ ఇంటిలో పని నిలిపేసింది. పోలీసులకు ఎక్కడో అనుమానం వచ్చి కవితా బాయి మీద నిఘా వేశారు.
రెండు రోజుల క్రితం కవితా బాయి చోరీ చేసిన బంగారు నగలు మెడలో వేసుకుని ఓ ఫోటో తీసుకుని వాట్సాప్ లో అప్ లోడ్ చేసింది. పోలీసులు వాట్సాప్ లో కవితా బాయి వేసుకున్న నగలు గుర్తించి సత్యనారాయణ రావ్ ను ఆరా తీశారు.
కవితా బాయి వేసుకున్న నగలు మా ఇంటిలో చోరీ అయినవే అని సత్యనారాయణ రావ్ గుర్తించారు. కవితా బాయిని అరెస్టు చేసిన శ్రీరాంపుర పోలీసులు ఆమె దగ్గర నుంచి 150 గ్రాముల బంగారు నగలు, 2 కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు.