ప్రధాని మోడీ వస్తున్నారు: కుక్కలు, పాములు పట్టుకోండి, నోటీసులు ఇచ్చిన పోలీసులు!
బెంగళూరు: బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో ఆదివారం జరుగుతున్న బీజేపీ పరివర్తనా యాత్రకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరౌతున్నారు. ఈ సందర్బంలో ఎయిర్ పోర్టులో పాములు, పరిసర ప్రాంతాల్లోని వీది కుక్కలను పట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన భద్రతా ఏర్పాట్లు చూసుకుంటున్న పోలీసు అధికారులు బీబీఎంపీకి నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు ఈ విషయం చర్చకు దారి తీసింది.
హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టు
ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రత్యేక విమానంలో హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టు చేరుకుంటారు. తరువాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాజ్ భవన్ మీదుగా బెంగళూరు ప్యాలెస్ మైదానం చేరుకుంటారు. ఈ సందర్బంలో హెచ్ ఏఎల్ దగ్గర భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.
అంతర్జాతీయ విమానాశ్రయం
దేవనహళ్ళి సమీపంలో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం అయిన తరువాత హెచ్ఏఎల్ విమానాశ్రయం అక్కడికి తరలించారు. ఇప్పుడు హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టును రక్షణ శాఖ, ప్రవేటు, వీవీఐపీల అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు.
పాములు, కుక్కలు
హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టును ముందులాగా ప్రతినిత్యం ఉపయోగించకపోవడంతో రన్ వే పరిసర ప్రాంతాల్లో విపరీతంగా పాములు ఉన్నాయని సమాచారం. ఇక హెచ్ఏఎల్ రోడ్డులో వీదికుక్కలు ఎలా గుంపులు గుంపులుగా ఉంటాయో ఆ పరిసర ప్రాంతాల్లో సంచరించే ప్రజలకు బాగా తెలుసు.
ఇన్స్ పెక్టర్ నోటీసులు
ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరు వస్తున్న సందర్బంగా హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టు ఆవరణంలో పాములు, రోడ్ల మీద ఉన్న వీది కుక్కలు మొత్తం పట్టుకోవాలని హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ బీబీఎంపీకి చెందిన అటవి శాఖకు లేఖ రాసి నోటీసులు పంపించారు. బీబీఎంపీ అటవి శాఖ సిబ్బంది ఇప్పుడు పాములు, కుక్కలు పట్టుకునే పనిలో నిమగ్నం అయ్యారు.
మా గురించి కాదా ?
ఇన్స్ పెక్టర్ రాసిన లేఖ బయటకురావడంతో ఇప్పుడు చర్చకు దారి తీసింది. వీది కుక్కలు, పాములు పట్టుకుంటున్నారని తెలుసుకున్న స్థానికులు మొదట వారి భద్రత కోసం అనుకున్నారు. ప్రధాని మోడీ పర్యనటతో భద్రతా ఏర్పాట్లలో భాగంగా పాములు, కుక్కలు పట్టుకుంటున్నారని అసలు విషయం తెలుసుకున్న స్థానికులు కనీసం ఇందులో 10 శాతం మా గురించి ఆలోచిస్తే వీది కుక్కల పోరు నుంచి మేము తప్పించుకుంటాము కదా ? అని ప్రశ్నిస్తున్నారు.