బెంగళూరు ఆర్ఆర్ నగర్ అసెంబ్లీ ఎన్నికలు, ఓటు వెయ్యడానికి ముందుకురాని ప్రజలు, బంద్ !
Recommended Video
బెంగళూరు: బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర్ (ఆర్ఆర్ నగర్) శాసన సభ నియోజక వర్గంలో ఓట్లు వెయ్యడానికి స్థానికులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మే 28వ తేదీ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయినా ఆర్ఆర్ నగర్ ఓటర్లు ఓటు వెయ్యడానికి ముందుకు రాకపోవడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. బంద్ ప్రభావం లేకపోయినా ఓటు వెయ్యడానికి స్థానికులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
ఎన్నికలు వాయిదా
మే 12వ తేదీన కర్ణాటక శాసన సభ ఎన్నికలు జరిగాయి. బెంగళూరు నగరంలోని ఆర్ఆర్ నగర్ నియోజక వర్గం పరిధిలోని జాలహళ్ళిలోని ఓ అపార్టుమెంట్ లో 9,000 పైగా ఓటరు గుర్తింపు కార్డులు బయటపడటంతో మే 28వ తేదీకి ఎన్నికలు వాయిదాపడ్డాయి.
కాంగ్రెస్, జేడీఎస్
కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. ఆర్ఆర్ నగర్ లో కాంగ్రెస్,జేడీఎస్ కలిసి పోటీ చెయ్యాలని మొదట నిర్ణయించారు. అయితే పోటీ నుంచి తప్పుకోవడానికి స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడు, జేడీఎస్ అభ్యర్థి జీహెచ్. రామచంద్రప్ప వెనక్కి తగ్గలేదు.
త్రిముఖ పోటీ
ఆర్ఆర్ నగర్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మునిరత్న నాయుడు, జేడీఎస్ నుంచి జీహెచ్. రామచంద్రప్ప, బీజేపీ నుంచి మునిరాజు గౌడ పోటీ చేస్తున్నారు. ఆర్ఆర్ నగర్ లో తాము కచ్చితంగా విజయం సాధిస్తామని ముగ్గురు నాయకులు ధీమాగా ఉన్నారు.
తగ్గుతున్న ఓటింగ్ శాతం
ఆర్ఆర్ నగర్ లో గతంలో కంటే ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని స్పష్టంగా కనపడుతోంది. ఇప్పటి వరకూ 16 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. స్యాండిల్ వుడ్ ప్రముఖ హీరోయిన్, జేడీఎస్ అభ్యర్థి జీహెచ్. రామచంద్రప్ప కోడలు అమూల్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో నటి అమూల్య మల్లేశ్వరంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ నాయకురాలు, ప్రముఖ నటి మాళవిక, ఆమె భర్త, నటుడు అవినాష్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మొరాయించిన ఈవీఎంలు
ఆర్ఆర్ నగర్ లోని పోలింగ్ బూత్ నెంబర్లు 154, 212లో ఈవీఎంలు మొరాయించాయి. ఓట్లు వెయ్యడానికి స్థానిక ప్రజలు రెండు గంటలపాటు క్యూలైన్ లో నిలబడి విసిగిపోయారు. స్యాండిల్ వుడ్ హీరో, నిత్యం వివాదాల్లో ఉంటున్న హుచ్చ వెంకట్ (పిచ్చి వెంకట్) ఆర్ఆర్ నగర్ లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.