బెంగళూరులో ఉంటున్నారా..జాగ్రత్త: కరోనా వ్యాప్తి వేగంగా ఉందని సైంటిస్టుల హెచ్చరిక..!
భారత్ను మరోసారి కరోనా కలవరపెడుతోంది. కేసులు తగ్గిపోయాయని ఊపిరి తీసుకుంటున్న నేపథ్యంలో మళ్లీ క్రమంగా కేసులు పెరుగుతుండటం వాటి వ్యాప్తి వేగంగా ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే పలు రాష్ట్రాలకు కేంద్ర బృందాలు వెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాల్లో కర్నాటక కూడా ఉంది. ముఖ్యంగా ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరులో వేగంగా వ్యాప్తి చెందుతోందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కరోనావైరస్ మళ్లీ కోరలు చాపుతోంది. కర్నాటకలో ఇప్పటికే రోజురోజుకు కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు చెందిన శాస్త్రవేత్తలు పలు పరీక్షలు నిర్వహించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. దేశ సగటుతో పోలిస్తే బెంగళూరు నగరంలో కరోనావైరస్ మ్యూటేషన్ రేటు అధికంగా ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. అంటే కరోనా వ్యాప్తి బెంగళూరులో వేగంగా జరుగుతోందని వారు చెప్పారు. ప్రొఫెసర్ ఉత్పల్ టాటు నేతృత్వంలోని శాస్త్రవేత్త బృందం పరిశోధన చేసింది. కోవిడ్ పాజిటివ్ ఉన్న పేషెంట్ల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించగా ఒక్కో శాంపిల్లో 11 మ్యూటేషన్స్ గమనించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దేశ సగటు 8.4 ఉండగా ప్రపంచ దేశాల సగటు 7.3గా ఉందని అంటే బెంగళూరు నగరంలో మ్యూటేషన్ రేటు ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు.
Recommended Video
ఒక పేషెంట్ శాంపిల్లో D614G అనే మ్యూటేటెడ్ వేరియంట్ కనుగొన్నట్లు చెప్పారు. ఇప్పుడు ఇదే వైరస్ వేరియంట్ బెంగళూరు నగరంలో వేగంగా వ్యాప్తి చెందుతోందని వివరించారు శాస్త్రవేత్తలు. అయితే ప్రస్తుతం ఉన్న కరోనా వ్యాక్సిన్ ఈ మ్యూటేషన్ను కట్టడి చేయగలదా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉందని చెప్పారు. బెంగళూరులో కనిపించిన మ్యూటేషన్ వేరియంట్ మూలాలు బంగ్లాదేశ్లో ఉన్నాయని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాదు భారత్లో కనిపిస్తున్న పలు రకాల వైరస్ వేరియంట్లు మూలాలన్నీ ఇతర దేశాల నుంచే ఉన్నాయని శాస్త్రవేత్తలు వివరించారు.