నన్ను రేప్ చేస్తామంటున్నారు!..: రేడియో జాకీ ర్యాపిడ్ రష్మీ
బెంగళూరు: సోషల్ మీడియాలో తనపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ దూషిస్తున్నారని, కొంతమంది రేప్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ పాపులర్ రేడియో జాకీ ర్యాపిడ్ రష్మీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రేడియో షోలో భాగంగా ఇటీవల 'రాజారథ' చిత్ర యూనిట్ తో మాట్లాడిన సందర్భంగా.. ప్రేక్షకులను కించపరిచే వ్యాఖ్యలు దొర్లినట్టు తెలుస్తోంది. ఆ వ్యాఖ్యలు చేసింది చిత్ర టీమ్ అయినప్పటికీ.. పలువురు నెటిజెన్స్ సోషల్ మీడియాలో ర్యాపిడ్ రష్మీని టార్గెట్ చేశారు.
కాగా, రేడియో షో సందర్భంగా.. 'రాజారథ' దర్శకుడు అనూప్ భండారీ, ఆయన సోదరుడు, హీరో నిరూప్ భండారీ, హీరోయిన్ అవంతిక షెట్టితో ర్యాపిడ్ రష్మీ ఫోన్ లో మాట్లాడారు. 'ఈ సినిమా చూడనివాళ్లను ఏంచేస్తారు?' అని రష్మీ వారిని ప్రశ్నించారు. దీనికి 'కొట్టిపడేస్తాం..' అంటూ వారు సమాధానం చెప్పారు. అంతేకాదు, మరో అభ్యంతరకర పదం కూడా వాడినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో రష్మీపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. గత 11ఏళ్లుగా కన్నడ రేడియోలో పనిచేస్తున్న తాను.. ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదని రష్మీ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫోటోలను అసభ్యకరమైన కామెంట్లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని అన్నారు. కొంతమంది రేప్ చేస్తామని కూడా బెదిరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. కాగా, రష్మీ పలు కన్నడ చిత్రాల్లోనూ నటించినట్టు సమాచారం.