ఎమ్మెల్యేకే టోకరా.. అకౌంట్ నుంచి రూ.1.9 లక్షలు మాయం
చెన్నపట్న నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్ బ్యాంకు ఖాతా నుంచి ఆయనకు తెలియకుండానే రూ.1.9 లక్షలు విత్ డ్రా అయ్యాయి.
బెంగళూరు: ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అకౌంట్ నుంచి దాదాపు రూ.2 లక్షలు మాయం అయ్యాయి. చెన్నపట్న నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన అకౌంట్ నుంచి రూ.1.9 లక్షలు ఎవరో మోసపూరితంగా విత్ డ్రా చేశారని ఆయన బనశంకరి పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జేసీ రోడ్డు శాఖలోని తన ఖాతా నుంచి మార్చి 18న ఈ డబ్బు చోరీ జరిగినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ముంబై, పూణే నుంచి వీటిని విత్ డ్రా చేసినట్లు కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ చోరీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏటీఎం కార్డు ద్వారా జరిగిందా? లేక సైబర్ క్రిమినల్స్ ఇతర పద్ధతుల ద్వారా చేశారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
విత్ డ్రా కు అవకాశముండే అన్ని రకాల విధానాలపై దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే ఈ సైబర్ క్రిమినల్స్ ను పట్టుకుంటామని బనశంకరి పోలీసులు పేర్కొన్నారు.