బెంగళూరు వరుస పేలుళ్లు: సాక్షులు రివర్స్
బెంగళూరు: 2008 జులై 25వ తేది బెంగళూరులో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసు విచారణ రివర్స్ అవుతున్నది. సాక్షులు కోర్టులో ఉల్టా కావడంతో పోలీసు అధికారులు షాక్ కు గురైనారు. కేరళ పీడీపీనాయకుడు, బెంగళూరు వరుస బాంబు పేలుళ్ల ప్రధాన నిందితుడు అబ్దుల్ నాసీర్ మదానిని ఈ కేసు నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్నారు.
బెంగళూరు వరుస బాంబు పేలుళ్లకు అబ్దుల్ నాసీర్ మదాని ప్లాన్ వేశారని ఆరోపిస్తు ఆయనను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ కేసులో మొదటి సాక్షి జోస్ వర్గీస్. జోస్ వర్గీస్ పోలీసుల ముందు ఒక విధంగా కోర్టులో ఒక విదంగా సాక్ష్యం చెప్పాడు.
అయితే ఈ కేసులోని రెండవ సాక్షి అయిన రఫీక్ సహ పోలీసులు ఒత్తిడి చెయ్యడం వలనే తాను అప్పుడు అలా సాక్ష్యం చెప్పానని, తాను ఇంతకు ముందు ఎప్పుడూ అబ్దుల్ నాసీర్ మదానిని చూడలేదని, కోర్టులోనే మొదటి సారి ఆయనను చూస్తున్నానని న్యాయస్థానంలో చెప్పాడు.
బాంబు పేలుళ్లకు కేరళలో స్కెచ్ వేశారు...........!
బెంగళూరులో వరుస బాంబు పేలుళ్లు సృష్టించడానికి మదాని కేరళలోని కోట్టాయంలో స్కెచ్ వేశారని పోలీసులు గుర్తించారు. స్కెచ్ వేసిన ఇల్లు జోస్ వర్గీస్ ది కావడంతో ఈ కేసులో అతనిని మొదటి సాక్షిగా చేర్చారు. పోలీసులకు ముందు ఇతను తాను మదానిని తన ఇంటిలో కలిశానని అంగీకరించాడు.
తరువాత కోర్టులో తాను మదానిని కలవలేదని తప్పుడు సాక్షం చెప్పాడు. మదాని తరుపు న్యాయవాదులు ఆ రోజు కోట్టాయంలో మదాని లేడని కోర్టులో సాక్షాలు సమర్పించారు. పోలీసులు ఒత్తిడి చెయ్యడం వలనే తాను ఆ రోజు ఆ సాక్షం చెప్పానని జోస్ వర్గీస్ కోర్టులో రివర్స్ అయ్యాడు.
అదే విదంగా రెండవ సాక్షి అయిన రఫీక్ సైతం కోర్టులో మదానికి అనుకూలంగా సాక్షం చెప్పి పోలీసులకు చుక్కలు చూపించాడు. పోలీసులు ఒత్తిడి చేసి తనను రెండవ సాక్షిగా చేర్చారని, బలవంతంగా తన దగ్గర సంతకం తీసుకున్నారని కోర్టులో చెప్పాడు.