భార్యాభర్తల గొడవ: టాప్ హీరోకు నోటీసులు జారీ, వారం రోజులు, విసిగిపోయిన పోలీసులు !
బెంగళూరు: స్యాండిల్ వుడ్ ప్రముఖ హీరో దునియా విజయ్ మీద కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు విచారణకు హాజరుకావాలని కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. కేసు నమోదు చేసి వారం రోజులు అయినా దునియా విజయ్ విచారణకు హాజరుకాకపోవడంతో విసిగిపోయిన పోలీసులు సీరియస్ అయ్యారు.
స్యాండిల్ హీరో దునియా విజయ్, ఆయన మొదటి భార్య నాగరత్న కొంత కాలంగా కుటుంబ సమస్యల కారణంగా ఒకరిమీద ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. విచారణకు హాజరుకావాలని బెంగళూరు దక్షిణ విభాగం డీసీపీ అన్నామలై దునియా విజయ్ కు సూచించారు.
అయితే దునియా విజయ్ మాత్రం విచారణకు పోలీసుల ముందు హాజరుకాలేదు. పదేపదే హీరో దునియా విజయ్, ఆయన మొదటి భార్య నాగరత్న పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం మొదలుపెట్టారు. హీరో దునియా విజయ్, ఆయన మొదటి భార్య నాగరత్న తీరుపై పోలీసులు విసిగిపోయారు.
ఇదే సమయంలో దునియా విజయ్, పానీపూరి కిట్టి వివాదం తెరమీదకు వచ్చింది. దునియా విజయ్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. తరువాత హీరో దునియా విజయ్ కోర్టును ఆశ్రయించి జామీను మీద బయటకు వచ్చాడు.
మొదటి భార్య నాగరత్న ఫిర్యాదు చేసిన కేసు విచారణకు మాత్రం దునియా విజయ్ హాజరుకాలేదు. విచారణకు హాజరుకావాలని సూచించి వారం రోజులు అయినా ఎందుకు రాలేదని, కచ్చితంగా పోలీసుల ముందు హాజరుకావాలని ఆదేశిస్తూ డీసీపీ అన్నామలై దునియా విజయ్ కు నోటీసులు జారీ చేశారు.