అర్థరాత్రి దారుణం: టెక్కీపై రెండుసార్లు గ్యాంగ్ రేప్ యత్నం, పోలీసుల నిర్లక్ష్య వైఖరి?
బెంగళూరు: ఒకేరోజు రెండుసార్లు అత్యాచార యత్నానికి గురైన ఓ అమ్మాయి.. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషనుకి వెళ్తే.. 'ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాం.. తర్వాత ఫిర్యాదు చేయండి' అంటూ ఓ నిర్లక్ష్యపు సమాధానం. ఏడు రోజుల తర్వాత గానీ ఘటనపై కేసు నమోదు చేసుకోని వైనం. బెంగళూరులో మహిళా భద్రత రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో.. అక్కడి పోలీసుల వైఖరి కూడా విమర్శలకు తావిచ్చేదిగా మారుతోంది.
ఇంతకీ ఏం జరిగింది?:
సునీల్(24), అతని సహోద్యోగి అయిన ఓ అమ్మాయి(23).. ఇద్దరు కలిసి ఓ సాఫ్ట్ వేర్ సంస్థను నడిపిస్తున్నారు. మే 2వ తేదీ రాత్రి ఆఫీస్ అయిపోయాక.. ఇద్దరు కలిసి డిన్నర్ చేసి అర్థరాత్రి 2గం. సమయంలో ఇంటికి బయలుదేరారు. ఆ అమ్మాయిని ఇంటి వద్ద దిగబెట్టడానికి సునీల్ ఆమెను తనపై బైక్ పై తీసుకెళ్లాడు.
మార్గమధ్యలో దాడి..:
ఆఫీస్ నుంచి ఇంటికెళ్తున్న క్రమంలో ఇందిరానగర్ 80ఫీట్ రోడ్ వద్దకు చేరుకోగానే.. ఐదారుగురు గుర్తుతెలియని వ్యక్తులు వారి బైక్ కి అడ్డుపడ్డారు. తాము పోలీసులమని చెబుతూ నకిలీ ఐడీ కార్డులు చూపించి బెదిరించారు. అర్థరాత్రి సమయంలో ఎక్కడికి వెళ్తున్నారంటూ ఇద్దరిని బెదిరించారు. వారు నకిలీ పోలీసులు అని గుర్తించిన సునీల్.. కాస్త గట్టిగానే సమాధానం చెప్పాడు. దీంతో ఆగ్రహం చెందిన ఆ గ్యాంగ్ సునీల్ ముఖంపై గట్టిగా పిడిగుద్దులు కురిపించింది.
అత్యాచార యత్నం:
సునీల్ పై దాడి చేసిన ఆ గ్యాంగ్.. బైక్ పై కూర్చున్న అమ్మాయి జుట్టు పట్టుకుని లాగారు. ఆమెను తాకరాని చోట తాకుతూ రోడ్డు మీదకు నెట్టారు. పరిస్థితి చేజారిపోతుండటంతో ఇద్దరు గట్టిగా కేకలు పెట్టారు. దీంతో అటుగా వెళ్తున్న కొంతమంది పరుగున వచ్చారు. ఆలోపు దుండగులు బైక్స్ పై అక్కడినుంచి పారిపోయారు.
అయితే సునీల్ ఓ బైక్ నంబర్ నోట్ చేసుకుని.. ఇదే విషయమై స్థానిక జేబీ నగర్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసేందుకు అమ్మాయిని వెంటపెట్టుకుని వెళ్లాడు. కానీ అక్కడికెళ్లాక 'అంతా ఎన్నికల విధుల్లో ఉన్నారు.. తర్వాత వచ్చి ఫిర్యాదు చేయండి' అని శివలింగప్ప అనే కానిస్టేబుల్ ఒకరు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు.
ఆ వెంటనే గ్యాంగ్ అత్యాచారయత్నం..:
పోలీస్ నిర్లక్ష్య సమాధానంతో చేసేదేమి లేక ఆ ఇద్దరు తిరిగి ఇంటికి బయలుదేరారు. అయితే జేబీనగర్ ప్రభుత్వ పాఠశాలకు సమీపంలోని క్రాస్ రోడ్ వద్దకు రాగానే మరో గ్యాంగ్ వీరిపై దాడి చేసింది. ఎనిమిది, తొమ్మిది మంది ఉన్న ఆ గ్యాంగ్ వీరి బైక్ కి అడ్డుపడి.. కత్తితో బెదిరించింది. సునీల్ ను రాయితో కొట్టి, ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ 150మీ. దూరంలోని ఓ మైదానం వద్దకు లాక్కెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారానికి యత్నించగా.. అటుగా వెళ్తున్న ఇద్దరు ద్విచక్రవాహనదారులు ఆమెను కాపాడారు. వారిని చూసి దుండగులు అక్కడినుంచి పరారయ్యారు.
కమిషనర్ ఆఫీసుకి ఫోన్ చేస్తే తప్ప:
మరుసటి రోజు ఉదయం ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. పోలీసుల నుంచి మళ్లీ అదే నిర్లక్ష్యపు సమాధానం ఎదురైంది. అయితే స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ కి తమ ఫిర్యాదును ఓ పేపర్ పై రాసిచ్చి వచ్చామని సునీల్ చెప్పాడు. ఇదే విషయమై ఆ తర్వాత వరుసగా మూడు రోజులు వెళ్లి కలిసినా.. కేసు మాత్రం నమోదు చేయలేదని వాపోయాడు. మే 16న తాను కమిషనర్ ఆఫీసుకి పలుమార్లు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే తప్ప ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు.
రెండూ.. ఒక గ్యాంగేనా?
రెండుసార్లు దాడికి పాల్పడింది ఒకరేనా అని బాధితుడిని స్థానిక మీడియా ప్రశ్నించగా.. కచ్చితంగా చెప్పలేనని పేర్కొన్నాడు. అయితే మొదట దాడి చేసిన గ్యాంగ్.. తమిళ్, హిందీల్లో మాట్లాడారని, ఆ తర్వాత దాడి చేసిన గ్యాంగ్ కన్నడ, తమిళంలో మాట్లాడారని చెప్పాడు. రెండోసారి దాడి చేసిన గ్యాంగ్ వద్ద బైక్స్ ఏమి లేవని, వారు పరుగెత్తుకుంటూనే పారిపోయారని పేర్కొన్నారు.
ఇకపోతే కేసు విషయమై జేబీనగర్ ఎస్ఐని ఆరా తీయగా.. అలాంటి ఘటన ఏది తన దృష్టికి రాలేదని చెప్పడం గమనార్హం. అదనపు కమిషనర్ సీమంత్ కుమార్ స్పందిస్తూ.. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్నంత మాత్రానా బేసిక్ పోలీస్ డ్యూటీ మరిచిపోవడం సరికాదన్నారు.