బెంగళూరు ఆసుపత్రిలో పిచ్చోడి కాల్పుల కలకలం
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులోని నిమ్హాన్స్ ఆసుపత్రిలో ఆదివారం మానసిక వ్యాధిగ్రస్తుడైన విచారణ ఖైదీ కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. కాపలా ఉన్న పోలీసుల నుంచి తుపాకీని లాక్కొని ఇష్టారీతిగా 23 రౌండ్లు కాల్పులు జరిపాడు.
సమాచార అందుకున్న గరుడా కమెండోలు రంగ ప్రవేశం చేసి అతడి పైన కాల్పులు జరిపారు. గాయపడ్డ అతనిని చికిత్స కోసం అత్యవసర కేంద్రానికి తరలిస్తుండగా మృతి చెందాడు.
పోలీసులను, మెంటల్ ఆసుపత్రి సిబ్బందిని గంటల పాటు అతను ముప్పుతిప్పలు పెట్టాడు. చివరికి కమాండోల రాకతో హైడ్రామాకు తెరపడింది.
బెంగళూరు శివారులోని పరపనాగ్రహర సెంట్రల్ జైలు నుంచి విశ్వనాథ్(22) అనే మానసిక రోగిని చికిత్సకు ఆదివారం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ (నిమ్హాన్స్)కు పోలీసులు తీసుకు వచ్చారు.
తనకు టాయిలెట్ వస్తుందని పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు అతనికి వేసిన బేడీలను తీసేశారు. ఆ తర్వాత విశ్వనాథ్ ఓ పోలీసు 303 రైఫిల్ను తీసుకుని నేలవైపు, భవనం పైవైపు కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. గరుడ కమాండో ఫోర్స్ రంగంలోకి దిగి విశ్వనాథ్పై కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడి, అనంతరం మృతి చెందాడు.
కాగా, విశ్వనాథ్ ఆర్టీ నగర్లో 2012లో జరిగిన హత్య, తదితర కేసుల్లో విచారణ ఖైదీగా పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నాడు. మానసిక వ్యాధితో బాధపడుతుండటంతో నిమ్హాన్స్ ఆసుపత్రికి తీసుకు వచ్చి చికిత్స చేయిస్తున్నారు.