కావేరీ చిచ్చు: రజనీకాంత్కు సెగ, పోస్టర్ల చించివేత, ఇంటివద్ద భద్రత
చెన్నై/బెంగళూరు: ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్కు తమిళనాడులోనే కాకుండా, కర్నాటక, దక్షిణాది రాష్ట్రాలు, భారత దేశంతో పాటు విదేశాల్లోను మంచి ఫాలోయింగ్ ఉంది. కర్నాటకలోను అతనికి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.
ఇటీవల కావేరి నీటి వివాదం తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య చిచ్చు రాజేసిన విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా బెంగళూరులో విధ్వంసం చోటు చేసుకుంది.
ఈ నేపథ్యంలో కర్నాటకలో పుట్టి, తమిళనాడులో సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ను కూడా నిరసనకారులు లక్ష్యంగా చేసుకున్నారు. బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాల్లో కన్నడీయులు ఆయనను టార్గెట్ చేశారు. కర్నాటకకు చెందిన కొందరు నిరసనకారులు ఆయన పోస్టర్స్ను చించివేశారు.
ఇటీవల రజనీకాంత్ నటించిన కబాలి సినిమా విడుదలైన విషయం తెలిసిందే. కబాలి సినిమా పోస్టర్లు, హోర్డింగులు బెంగళూరు, మైసూరులలో ఉన్నాయి. ఇందులోని కొన్ని పోస్టర్లను నిరసనకారులు చించివేశారు. తమిళనాడుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చించేశారు.
మైసూరులోని సిద్ధార్థ్ నగర్లో రజనీకాంత్ హోర్డింగుల పైన దాడికి పాల్పడ్డారు. రామకృష్ణా నగర్ సర్కిల్లో పోస్టర్లు చించివేశారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, తమిళ సూపర్స్టార్ రజనీకాంత్కు తమిళనాడు ప్రభుత్వం భద్రత పెంచింది. రజనీ కర్ణాటకకు చెందిన వారు. రజనీతోపాటు ప్రభుదేవా, రమేష్ అరవింద్, బాబీ సింహా వంటి కర్ణాటకకు చెందిన నటుల ఇంటి వద్ద కూడా భద్రత పెంచింది.
ఇదంతా ముందు జాగ్రత్త చర్య మాత్రమే అని చెబుతున్నా ఇంటెలిజెన్స్ రిపోర్టుల కారణంగానే తమిళనాడు ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కన్నడ వాళ్లైన రజనీ, ప్రభుదేవ, బాబీ సింహా, రమేష్ అరవింద్లపై దాడి జరిగే అవకావముందన్న ఐబీ హెచ్చరికల నేపథ్యంలోనే ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లుగా చెబుతున్నారు.