ఫ్రెండ్ బర్త్ డే పార్టీ, రాత్రి వద్దని చెప్పిన తల్లి, బెంగళూరు విద్యార్థిని ఏం చేసిందంటే!
బెంగళూరు: స్నేహితురాలి బర్త్ డే పార్టీకి వెలుతానని కాలేజ్ విద్యార్థిని కుటుంబ సభ్యులకు చెప్పింది. పరీక్షలు జరుగుతున్న సమయంలో చదువుకోకుండా బర్త్ డే పార్టీలకు ఎందుకు వెలుతున్నావని ఆమె తల్లి మందలించింది. అంతే తల్లి బర్త్ డే పార్టీకి వెళ్లకుండా అడ్డుకుందని ఆ యువతి కుటుంబ సభ్యులకు విషాదం మిగిల్చింది.
ఇంటర్ అమ్మాయి
బెంగళూరులోని కెంపేగౌడనగర పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న అర్పిత (18) పీఇఎస్ కాలేజ్ లో పీయూసీ (ఇంటర్) ద్వితీయ సంవత్సరం విద్యాభ్యాసం చేస్తోంది. గురువారం అర్పిత ఎప్పటిలాగే కాలేజ్ కు వెళ్లి వచ్చింది.
ఫ్రెండ్ బర్త్ డే పార్టీ
గురువారం రాత్రి అర్పిత ఫ్రెండ్ బర్త్ డే. రాత్రి బర్త్ డే పార్టీ ఏర్పాట్లు చేశారు. గురువారం రాత్రి అర్పిత బర్త్ డే పార్టీకి వెళ్లడానికి చక్కగా అలంకరించుకుంది. తరువాత తాను బర్త్ డే పార్టీకి వెలుతున్నారని, రాత్రి ఆలస్యం అవుతోందని అర్పిత ఆమె తల్లికి చెప్పింది.
మొండి చేసిన యువతి
పరీక్షలు సమీపిస్తున్నాయని, బుద్దిగా ఇంటిలో ఉండి చదువుకోవాలని, నగరంలో పరిస్థితులు బాగలేనప్పుడు రాత్రి పూట ఎందుకు పార్టీలకు వెలుతున్నావని అర్పితను ఆమె తల్లి నిలదీసింది. తాను కచ్చితంగా బర్త్ డే పార్టీకి వెళ్లాలని యువతి పట్టుబట్టింది.
తల్లితో వాగ్వివాదం
బర్త్ డే పార్టీకి వెళ్లడానికి వీలులేదని అర్పిత తల్లి తేల్చి చెప్పింది. ఆ సమయంలో తల్లితో వాగ్వివాదానికి దిగిన అర్పిత కోపంగా తన గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి ఎంత సేపు అయినా అర్పిత బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే అర్పిత మరణించింది. కెంపేగౌడ నగర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.