నీరవ్ మోడీకి ఈడీ షాక్: వేలానికి రూ. 2 కోట్ల బెంట్లీ సహా 13 లగ్జరీ కార్లు
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లో సుమారు రూ. 13వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన వజ్రాల వ్యాపారి, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. నీరవ్ మోడీకి చెందిన 13 విలాసవంతమైన కార్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేలం వేసేందుకు సిద్ధమైంది.
నీరవ్ మోడీ కార్లలో రూ. 2 కోట్లకుపైగా విలువైన బెంట్లీ కారు కూడా ఉండటం గమనార్హం. నవంబర్ 7న ఈ వేలం నిర్వహించనున్నట్లు ఈడీ పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడైన నీరవ్ మోడీని లండన్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది మార్చిలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం లండన్లోని వాండ్స్వర్త్ జైల్లో ఉన్న నీరవ్ మోడీ.. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన విచారణ నవంబర్ 6న జరగనుంది. కాగా, ఈ ఏడాది ఆగస్టులో మనీలాండరింగ్ చట్టం ప్రత్యేక న్యాయస్థానాన్ని ఈడీ ఆశ్రయించింది.
నీరవ్ మోడీకి చెందిన ఆస్తులన్నింటినీ జప్తు చేసేందుకు అనుమతివ్వాలని కోరింది. అతడికి చెందిన విలువైన వాచ్లు, పెయింటింగ్స్, కార్లను వేలం వేసే విధంగా అనుమతి పొందింది. ఇందులో భాగంగా నవంబర్ 7న వేలం నిర్వహించనుంది.
13 కార్లలలో రెండు కార్లను మళ్లీ వేలం వేయనున్నారు. ఈ కార్లలో రోల్స్ రాయిస్ ఘోస్ట్ రూ. 1.70కోట్లు కాగా, పోర్చే పనమేరా రూ. 60లక్షలు కూడా ఉన్నాయి. కార్ల సామర్థ్యాన్ని బట్టి వేలం ప్రారంభ ధర ఉంటుందని ఈడీ పేర్కొంది. కాగా, ఇప్పటికీ పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో నీరవ్ మోడీ, అతని బంధువు మెహుల్ ఛోక్సీలకు సంబంధించిన పలు ఆస్తులను ఈడీ సీజ్ చేసిన విషయం తెలిసిందే.