కరోనాతో మరణించాడంటూ బాడీ అప్పగింత: దహనం తర్వాత బతికే ఉన్నాడంటూ ఫోన్!
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా రోగులకు సరైన చికిత్స అందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా చోటు చేసుకున్న ఘటన కూడా ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని శోకం నింపింది.
దహనం చేసిన తర్వాత..
దేవరాంభాయి భిసికర్ అనే వ్యక్తి బాడీ అంటూ అతని కుటుంబ సభ్యులకు ఓ మృతదేహాన్ని అప్పగించారు ఆస్పత్రి సిబ్బంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాల నేపథ్యంలో ఆ కుటుంబం అతని మృతదేహాన్ని బయటికి తీయకుండా, అతడ్ని చూడకుండానే దహనం చేశారు. తీవ్ర శోకంలో మునిగిపోయారు. అయితే, దహనం నిర్వహించిన తర్వాత సివిల్ ఆస్పత్రి సిబ్బంది.. భిసికర్ కరోనా చికిత్సకు స్పందిస్తున్నారంటూ అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
మరణించాడని చెప్పి..
కరోనా లక్షణాలుండటంతో దేవరాంభాయి భిసికర్ మే 28న అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి కరోనా విభాగంలో చేరారు. అయితే, మే 29న అతడు మరణించాడంటూ ఆస్పత్రి సిబ్బంది భిసికర్ కుటుంబానికి సమాచారం అందించారు. దీంతో వెంటనే ఆస్పత్రికి పరుగెత్తుకుంటూ వెళ్లారు. అప్పటికే భిసికర్ నమూనాలను కరోనా పరీక్షలకు పంపారు. మే 30న భిసికర్ మృతదేహానికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
పొరపాటేనంటూ.. అసలేమైంది?
ఆ తర్వాత భిసికర్ వైద్యానికి స్పందిస్తున్నాడంటూ ఆస్పత్రి నుంచి పిలుపువచ్చింది. దీంతో తమ భిసికర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడా? లేక తాము దహనం చేసింది భిసికర్ మృతదేహమేనా? అనే సందిగ్ధంలో మునిగిపోయారు కుటుంబసభ్యులు. ఆ తర్వాత భిసికర్ కుటుంబసభ్యులకు ఆస్పత్రి సిబ్బంది పొరపాటున ఫోన్ చేసి చెప్పారని ఆస్పత్రి నుంచి మరోసారి ఇతర సిబ్బంది చెప్పడం గమనార్హం.
Recommended Video
మళ్లీ ఆరోగ్యంగానే ఉన్నాడంటూ... చివరకు
అయితే, ఈ అనుమానాల నేపథ్యంలో మరోసారి ఆస్పత్రి సిబ్బందిని భిసికర్ కుటుంబసభ్యులు సంప్రదించగా... భిసికర్ ఆరోగ్యంగా ఉన్నారని, అతనికి కరోనా లేదని పరీక్షల్లో తేలిందని ఆస్పత్రి సిబ్బంది చెప్పడం గమనార్హం. కాగా, ఆస్పత్రి వైద్యుడు శశాంక్ జే పాండ్యా ఈ పరిణామాలపై మాట్లాడుతూ.. భిసికర్ షుగర్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతోనే మృతి చెందారని తెలిపారు. అయితే, కరోనా రిపోర్టులు రాకముందే భిసికర్ మృతదేహానికి అతని కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారని చెప్పారు.