రెండో స్థానం: అమేథీతో పాటు దక్షిణాది నుంచి కూడా రాహుల్ గాంధీ పోటీ?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రతి ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లోని అమేథి నుంచి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లోను అక్కడి నుంచే బరిలోకి దిగనున్నారు. ఆ స్థానంతో పాటు మరో లోకసభ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయట. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఆలోచనలు చేస్తోందని తెలుస్తోంది.
దక్షిణాదిన బీజేపీ కంటే కాంగ్రెస్ బలం ఎక్కువ. అలాగే, దక్షిణాదిన ఉన్న కీలక ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, డీఎంకే వంటి పార్టీలతో కాంగ్రెస్ పార్టీ సన్నిహితంగా ఉంటోంది. దక్షిణాదిన కాంగ్రెస్ పార్టీ మరింత మంచి ప్రదర్శన కనబరిచేందుకు ఆయన ఇక్కడి రాష్ట్రాల నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. రెండో నియోజకవర్గంగా దక్షిణాదిని ఎంచుకున్నారని తెలుస్తోంది.
మాయావతితో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే? ఏపీ-తెలంగాణ సీట్ల పంపకాలపై...
దక్షిణాది నుంచి రాహుల్ గాంధీ పోటీ!
రాహుల్ గాంధీ ఈసారి లోకసభ ఎన్నికల్లో దక్షిణాదిలోనూ పోటీ చేస్తారనే ప్రచారం చాలాకాలంగా సాగుతోంది. తెలంగాణ నుంచి పోటీ చేయాలని పలువురు టీ కాంగ్రెస్ నేతలు ఆయనకు విజ్ఞప్తి చేశారు కూడా. ఇందుకు రెండు మూడు నియోజకవర్గాలను చూపించారు. కానీ ఆయన దీనిపై చూద్దామని చెప్పారు కానీ స్పందించలేదు.
తెలంగాణ నుంచి విజ్ఞప్తులు
తెలంగాణ నుంచి పోటీ చేయకపోయినప్పటికీ మరో దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలోని ఓ లోకసభ స్థానం నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారట. తన ఎన్నికల ప్రచారాన్ని కూడా దక్షిణాది నుంచే ప్రారంభించడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. దక్షిణాది నుంచి పోటీ చేయాలంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పాటు ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ కార్యకర్తలు, కొందరు సీనియర్లు.. రాహుల్ గాంధీని కోరారట. వీరి డిమాండుకు రాహుల్ అంగీకరించారట.
గతంలో సోనియా గాంధీ పోటీ చేశారు
గతంలో సోనియా గాంధీ సైతం కర్ణాటకలోని బళ్లారి నుంచి పోటీ చేసి సుష్మా స్వరాజ్పై గెలిచారు. 2014 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి, గుజరాత్లోని వడోదర నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. అయితే రెండు స్థానాల నుంచి పోటీపై అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు.