పేదరిక నిర్మూలనే ప్రథమ ప్రాధాన్యం: నాలుగేళ్ల పాలనపై ప్రధాని మోడీ
కటక్: పేదరిక నిర్మూలనే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ప్రధాని మోడీ నాయకత్వం, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కేంద్రంలో పాలనాపగ్గాలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒడిశాలోని కటక్లో నిర్వహించిన బహిరంగ సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు.
' కటక్ నాకెంతో ప్రత్యేకమైన ప్రాంతం. ఇక్కడి నుంచి నేను ప్రారంభించిన ప్రతి పనీ విజయవంతమైంది. ఇక్కడికి వచ్చిన వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. పూరీ జగన్నాథుడు కొలువైన పవిత్రమైన రాష్ట్రమిది. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మించిన గడ్డ ఇది. ఇలాంటి ఎంతో పేరున్న ప్రదేశానికి నేనే ఈరోజు రావడం ఎంతో సంతోషంగా ఉంది' అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
'అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఎన్నో ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టాం. బీజేపీ ఎప్పుడూ ప్రజలకు అండగానే ఉంటుంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. శత్రువులనూ కూడా మిత్రులను చేసుకోగల నైజం కేవలం బీజేపీకే ఉంది. మా మీద నమ్మకం ఉంచే మీరు 2014లో మాకు పట్టం కట్టారు. అలాంటి మీ విశ్వాసానికి భంగం కలిగించే ఏ పనులు బీజేపీ చేయదు. బీజేపీ అధికారంలోకి వచ్చాకే ప్రజలకు ప్రభుత్వాలపై నమ్మకం ఏర్పడింది. పేదరికం అంటే ఏంటో నాకు తెలిసినంత ఎవరికీ తెలిసి ఉండదు. అందుకే నేను పేదల పక్షపాతిని. బీజేపీ పాలన నీతిబద్ధమైందని మరోసారి కర్ణాటకలో రుజువైంది. మా మీద నమ్మకం ఉంది కాబట్టే మాకు ప్రజలు 104 స్థానాలు ఇచ్చారు. దేశం ఇప్పుడు సరైన దారిలో నడుస్తోంది.' అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
' అన్ని వర్గాల సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినన్ని పథకాలు ఇంకెవరూ అమలు చేయలేదు. నల్లధనాన్ని వెలికితీసేందుకు పెద్దనోట్లను రద్దు చేసి చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. ఎన్నో ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టాం. అదుంలో జీఎస్టీ ఒకటి. కానీ ఇవేవీ విపక్షాలకు మింగుడు పడటం లేదు. కుంభకోణాల రహిత దేశాన్ని ప్రజలకు అందివ్వడమే మా లక్ష్యం. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. గతనాలుగేళ్లలో మేం సాధించిన ఖ్యాతి అంతా ప్రజలకే చెందుతుంది' అని మోడీ తెలిపారు. దేశంలో ప్రస్తుతం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని పదవుల్లో ఉన్నవారందరూ పేదరికం ఎదుర్కొన్నవారేనని చెప్పారు. అందుకే పేదరిక నిర్మూలనకే తమ ప్రథమ ప్రాధాన్యమని పునరుద్ఘాటించారు.